త్రిపురలో బీజేపీ ప్రజాకర్షక ప్రచారాన్ని సీపీఎం ఎదుర్కోలేకపోయింది - మాజీ సీఎం మాణిక్ సర్కార్
2018 ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడంలో తమ పార్టీ విఫలం అయ్యిందని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. ఆ హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
త్రిపురలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రజాకర్షక ప్రచారాన్ని సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ఫ్రంట్ ఎదుర్కోలేకపోయిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం మాణిక్ సర్కార్ అంగీకరించారు. శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందని అన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన వేతనాలు, యువతకు ఉపాధి, పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకం మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసిందని చెప్పారు.
రామజన్మభూమి ఆధారాలు బయటపెట్టిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ కన్నుమూత
సమాజంలోని అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తమ విజన్ డాక్యుమెంట్ను రూపొందించిన తీరు ప్రజలను తప్పుదోవ పట్టించిందని మాణిక్ సర్కార్ మండిపడ్డారు. ‘‘ ప్రతి కుటుంబంలో సగటున ఐదు నుండి ఆరుగురు సభ్యులు ఉంటారు. అందులో సంపాదించే వ్యక్తి కుటుంబానికి సహజ నాయకుడు అవుతారు. అతడే కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తాడు ’’ అని ఆయన చెప్పారు.
త్రిపురలో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారని ఆయన తెలిపారు. త్రిపురలో కమ్యూనిస్టులను ఓడించేందుకు వామపక్ష వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ బీజేపీ గొడుగు కిందకు వెళ్లాయని సర్కార్ ఆరోపించారు. బీజేపీ తప్పుడు వాగ్దానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయామని ఆయన అంగీకరించారు. ఆర్ఎస్ఎస్, సంస్థాగత బలం వల్లే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందని అన్నారు.
మేం అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో టెంపరరీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం - కేజ్రీవాల్
త్రిపురలో ప్రభుత్వ పాలన బాగాలేదని కేంద్ర నిఘా సంస్థలు, బీజేపీ అంతర్గత అంచనాలు సూచించాయని సర్కార్ పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖాలతో పోరాడితే బీజేపీకి నష్టం వాటిల్లుతుందని వారికి అర్థమైందని అన్నారు. అందుకే 2047 వరకు ఆ పదవిలో కొనసాగుతానని ఒకప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి (బిప్లబ్ దేబ్)ని ఆకస్మికంగా తొలగించారని మాణిక్ సర్కార్ అన్నారు. వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన బీజేపీ ప్రజలకు ద్రోహం చేసిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
మాణిక్ సర్కార్ చేసిన ఆరోపణలను త్రిపుర బీజేపీ ఉపాధ్యక్షురాలు రెబాటి ఖండించారు. పార్టీ విజన్ డాక్యుమెంట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని అలాగే ఇతర అభివృద్ధి పనులను కూడా చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో సీఎం పదవి మార్పుపై ఆమె మాట్లాడుతూ.. ఆయన (బిప్లబ్ దేబ్) హర్యానాకు పార్టీ ఇంచార్జ్ గా నియామకం అవ్వడంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా నామినేట్ అయ్యారు. మాజీ సీఎం కోసం పార్టీకి వేరే ప్లాన్ లు ఉండవచ్చని అన్నారు.
ఇదిలా ఉండగా.. 60 మంది సభ్యులు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 2018లో ఎన్నికలు జరిగాయి. అయితే అంతకు ముందు ఆ రాష్ట్రంలో బీజేపీకి 2 శాతం తక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 36 సీట్లు గెలుచుకుంది. 25 ఏళ్లుగా త్రిపురలో పాతుకుపోయిన ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదిలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.