మేం అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో టెంపరరీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం - కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా ఉద్యోగులు దోపిడికి గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
8,736 మంది పాఠశాల ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించినందుకు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అభినందించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే చేయాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో గెస్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిందని చెప్పారు. అయితే కేంద్రం ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఆప్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ఆ పార్టీ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా దీనిని అమలు చేయాలని కోరారు. ‘‘ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించి ఎక్కువ మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్న తరుణంలో.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 8,736 మంది ఉపాధ్యాయుల సేవలను క్రమబద్ధీకరించారు. ఇది ఇతరులకు కూడా ఉదాహరణగా నిలుస్తుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.
జాతీయ విద్యా విధానం-2020లో మార్పులు అవసరం: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
గెస్ట్, రెగ్యులర్ టీచర్ల కృషితోనే ఢిల్లీలో విద్యా విప్లవం వచ్చిందని, పర్మినెంట్ ఉద్యోగులు పని చేయరనే భావన సరికాదన్నారు. ‘‘ ఢిల్లీలోని ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లలో మా రెగ్యులర్ సిబ్బంది అద్భుతాలు చేసారు. ఢిల్లీలోని ఈ రెగ్యులర్ టీచర్లు, వైద్యులు, విద్య, ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మాకు సహాయం చేశారు’’ అని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థలో అత్యధికంగా అట్టడుగు స్థాయికి వచ్చిన పేదలే ఉంటారని అన్నారు. వారిపై దోపిడీ చాలా ఎక్కువగా ఉందని అన్నారు. ఆ దోపిడీని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ చెప్పారు.
కాంట్రాక్టు ఉపాధి వ్యవస్థను సీఎం కేజ్రీవాల్ అత్యంత దోపిడీ అని అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంటే రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు తగ్గిస్తున్నాయని ప్రశ్నించారు. ‘‘ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తాత్కాలిక ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని నేను కోరుతున్నాను. మా ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడితే అక్కడ తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను ’’ అని కేజ్రీవాల్ అన్నారు.