నన్ను దూషించే పనిని కాంగ్రెస్ మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చేసింది - ప్రధాని నరేంద్ర మోడీ..
కాంగ్రెస్ పార్టీ తనను దూషించే కాంట్రాక్ట్ ను మరో పార్టీకి ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
తనను దూషించే పనిని కాంగ్రెస్ పార్టీ మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ మౌనంగా తన పని తాను చేసుకుపోతోందని తెలిపారు. మంగళవారం గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా జమ్కడోర్నా పట్టణంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. గత 20 ఏళ్లలో గుజరాత్కు వ్యతిరేకంగా ఉన్నవారు రాష్ట్ర పరువు తీయడానికి ఏ ఒక్క రాయిని వదిలిపెట్టలేదని ఆరోపించారు. వారు నన్ను ‘‘మౌత్ కా సౌదాగర్’’ (మరణ వ్యాపారి)గా పిలవడంతో పాటు నన్ను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని అన్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పేరు ప్రస్తావించకుండా మోడీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (కాంగ్రెస్) ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. గొడవలు సృష్టించడం, శబ్దం చేయడం వంటివి చేయడం లేదు. నన్ను తిట్టే పనిని ఇతరులకు (ఆమ్ ఆద్మీ పార్టీ) కు కాంట్రాక్ట్ ఇచ్చేశారు. తాను నిశ్శబ్దంగా గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి ఓట్లు అడుగుతున్నాను ’’ అని ఆయన అన్నారు.
భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం గుజరాత్లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడటానికి వెళ్లారా అని ప్రజలు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. సర్దార్ పటేల్ను గౌరవించని వారికి గుజరాత్లో చోటు దక్కదని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపరులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఓ వర్గం అరుస్తోందని, ప్రజలను దోచుకున్న వారిపై తాను చర్యలు తీసుకోకూడదా అని ఆయన ప్రశ్నించారు.
‘‘ ప్రతిపక్ష పార్టీ నిశ్శబ్దంగా ఉంటోంది. ఈ వ్యూహం పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను మిమ్మల్ని (బీజేపీ కార్యక్తరలు, నాయకులు, మద్దతుదారులు) హెచ్చరిస్తున్నాను. ఇది ఢిల్లీ నుండి గుజరాత్పై కుట్రకు పాల్పడుతున్న వారితో కంట్రోల్ అవుతోంది.ఈ విషయం నాకు తెలుసు ’’ అని ప్రధాని అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు.. అఖిలేష్కి ఓదార్పు
ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్ అభివృద్ధిని కూడా ప్రస్తావించారు. గుజరాత్ రాష్ట్రం విద్యా కేంద్రంగా మారిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించామని తెలిపారు. మెడికల్, కంప్యూటర్ తో పాటు ఇంజినీరింగ్ ఫ్యాకల్టీలో సీట్లు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువత దీని వల్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు.