నాడు తండ్రి.. నేడు తనయుడు.. 37 యేండ్ల తర్వాత తండ్రి స్థానంలో చంద్రచూడ్ భాధ్యతలు .. చారిత్రాత్మక తీర్పులు
భారత ప్రధాన న్యాయమూర్తి ఉమేష్ లలిత్ నవంబర్ 8న తన పదవి నుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన వారసుడుగా జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యే కానున్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును త్వరలో నూతన ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ త్వరలో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం.. ప్రస్తుతం సీజేఐగా వ్యవహరిస్తున్నవ్యక్తి తదుపరి సీజేఐని సిఫారసు చేశారు. తత్ఫలితంగా లలిత్ కొత్త సీజేఐ పేరుగా డీవై చంద్రచూడ్ పేరును సిఫారసు చేశారు. జస్టిస్ యుయు లలిత్ వచ్చేనెల 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 9వ తేదీన కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
50వ సీజేఐగా..
తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నియామకం కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ మేరకు సంబంధించిన అధికారిక లేఖను సీనియర్ జస్టిస్ చంద్రచూడ్ కు అందజేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నారు. దీంతో సుప్రీంకోర్టు 50వ సీజేఐగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనప్రాయమే కానున్నది. ఆయన 2024 నవంబర్ 10వ తేదీ వరకు పదవీలో కొనసాగనున్నారు.
37 ఏళ్ల తర్వాత తండ్రి స్థానంలో
జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సీజేఐగా పని చేశారు. ఆయన 16వ సీజేఐగా ఆయన బాధ్యతలను నిర్వర్తించారు. 1978 ఫిబ్రవరి 2 నుంచి 1985 జులై 11వ తేదీన వరకు దాదాపు 7 సంవత్సరాలు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇది అత్యంత సుదీర్ఘమైనది. ఇప్పుడు తన తండ్రి పదవీ విరమణ చేసిన 37 ఏళ్ల తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా అదే అత్యున్నత పదవి బాధ్యతను స్వీకరించబోతున్నారు.
డీవై చంద్రచూడ్ ఎవరు?
నవంబర్ 11, 1959లో జన్మించిన జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిగా సేవలందిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ఆయన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ, హార్వర్డ్ లా స్కూల్ మరియు అనేక విదేశీ న్యాయ కళాశాలల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నామినేట్ అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ 1998లో అదనపు సొలిసిటర్ జనరల్గా సేవలందించారు. 2013లో తొలిసారిగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన కేరీర్ లో ఎన్నో కేసుల్లో చారిత్రత్మక తీర్పులు ఇచ్చారు. శబరిమల, స్వలింగ సంపర్కం, ఆధార్, అయోధ్యకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తిగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు.
చారిత్రాత్మక తీర్పులు..
జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఎన్నో చారిత్రాత్మక తీర్పులను వెల్లడించారు. 2017-18లో తన తండ్రి ఇచ్చిన రెండు తీర్పులను జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు. ఇందులో అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 2018లో ఈ నిర్ణయాన్ని జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.
ఇటీవల కూల్చివేసిన ట్విన్ టవర్స్ మీ అందరికీ బాగా గుర్తు ఉంటుంది. ఆగస్టు 31న టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సంచలన తీర్పు నివవ్వడంతో జస్టిస్ చంద్రచూడ్ కీలక పాత్ర పోషించారు. అలాగే.. మహిళలందరికీ అబార్షన్ హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకునే హక్కును ఆయన సమర్థించారు.
కేరళలో అఖిలా అశోక్ అలియాస్ హదియా (25) 2016లో షఫీన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లాడింది. కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని లవ్ జిహాద్గా అభివర్ణించారు. హైకోర్టు వివాహాన్ని రద్దు చేసింది, అయితే హదియా వివాహాన్ని రద్దు చేయాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను ఆయన తోసిపుచ్చారు.
అలాగే.. అయోధ్య-బాబ్రీ మసీదు కేసును పరిష్కరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ భిన్నమైన తీర్పును ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలన రేపిన శబరిమల ఆలయంలోకి ప్రవేశించే అన్ని వయసుల మహిళల హక్కును సమర్థించిన ధర్మాసనం న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన ధర్మాసనంలో ఆయన కూడా భాగస్వామి.