కోయంబత్తూర్ కారు పేలుడు.. ఎన్ఐఏతో విచారణ జరిపించాలని తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
కోయంబత్తూరులో ఇటీవల కలకరం రేపిన కారు బాంబు ఘటనను ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు.
కోయంబత్తూరు కారు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు అంతర్జాతీయ లింక్ ఉండవచ్చని సీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఉగ్రవాది.. జవాన్ కు గాయాలు
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తమిళనాడు పోలీసు శాఖలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. కరుంబు కడై, సుందరపురం, కౌడంపాళయంలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ముఖ్యమైన నగరాలు, ప్రదేశాలలో, అధునాతన సీసీటీవీ కెమెరాలను చేస్తారు.
రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ యూనిట్లలో అదనపు బలగాలను మోహరించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలను ప్రతి నిమిషం సేకరించడానికి ఇది సహాయపడుతుందని, వివరాలను అందించే వారికి రక్షణ కల్పించాలని కూడా సీఎంవో పేర్కొంది.
దీపావళి కోసం సెలవుపై వచ్చిన ఆర్మీ జవాన్ దారుణ హత్య.. ఎక్కడంటే?
మరోవైపు కారు పేలుడుపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు ఈ ఉదయం కోయంబత్తూరుకు చేరుకున్నారు. దక్షిణ భారత ఎన్ఐఏ చీఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కేబీ వందన నేతృత్వంలోని బృందం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైంది.
కారు పేలుడుకు సంబంధించి కోయంబత్తూరు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి, వారిపై యూఏపీఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. నిందితులను మహ్మద్ తల్కా, మహ్మద్ అజారుద్దీన్, మహ్మద్ నవాస్ ఇస్మాయిల్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్ లుగా గుర్తించారు. కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడుల తరహాలోనే దక్షిణ భారతదేశంలో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నినట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.