సారాంశం

ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎంటర్ అవుతుండగా ఓ 15 ఏళ్ల బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలిస్తే అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 
 

అహ్మదాబాద్: ఒకప్పుడు హార్ట్ ఎటాక్ అంటే వయోవృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది. యువకుల్లో చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో పిల్లలు కూడా గుండెపోటుతో మరణించిన ఘటనలు తరుచుగా చదువుతున్నాం. ఈ ఆందోళనకర ధోరణి అందరినీ కలవరపెడుతున్నది. ఈ తరుణంలో గుజరాత్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎంటర్ అవుతూనే కుప్పకూలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపు మరణించింది. గుజరాత్‌లోని అమ్రేలిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

15 ఏళ్ల సాక్షి రాజోసరా తొమ్మిదో తరగతి చదువుతున్నది. 9వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న ఆ బాలిక పరీక్షా కేంద్రంలోకి ప్రవేశిస్తుండగానే కుప్పకూలిపోయింది. ఆమె నేలపై పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కూడా రికార్డ్ అయినట్టు అధికారులు తెలిపారు. బాధితురాలు రాజ్‌కోట్ జిల్లా నివాసి.

Also Read: Mahadev App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ నుంచి భుపేశ్ బఘేల్ వరకు.. ఈ స్కాం ఏమిటీ? సీఎంకు ఏమిటీ సంబంధం?

శాంతబ గజేరా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ చతుర్ ఖుంత్ మాట్లాడుతూ.. ఆ బాలిక ఎగ్జామినేషన్ హాల్‌‌లోకి వెళ్లుతుండా కుప్పకూలిందని, వెంటనే ఆమెను సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లామని వివరించారు. అయితే.. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారని తెలిపారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారని, ఆమె మరణానికి కచ్చితమైన కారణం పోస్టుమార్టంలోనే తెలుస్తుందని చెప్పారు.