కొలిజియం సిఫారసులు.. ఆ వార్తలేంటీ, కొంచెమైనా బాధ్యత వుండాలిగా: మీడియాపై జస్టిస్ ఎన్వీ రమణ అసహనం
సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురు మహిళా జడ్జిలున్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను రాసేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫార్సులపై వస్తున్న మీడియా కథనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను రాసేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కొలీజియం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడకముందే ఇలా వార్తలు రాయడం వల్ల చెడు జరిగే ప్రమాదం ఉందని రమణ వ్యాఖ్యానించారు.
జడ్జిల నియామక ప్రక్రియ అంటే ఎంతో పవిత్రమైనదని.. దానికంటూ ఓ గొప్పతనం ఉందని సీజేఐ స్పష్టం చేశారు. కాబట్టి మీడియా మిత్రులంతా ఆ ప్రక్రియ పవిత్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గొప్ప స్థాయికి ఎదగాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారని, అయితే, ఇలాంటి బాధ్యతారహితమైన వార్తల వల్ల అలాంటి వారి కెరీర్ నష్టపోయిన దాఖలాలు చాలా ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు.
Also Read:ఇండియాకు తొలి మహిళా సీజే? ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న
ఇంతటి సీరియస్ వ్యవహారాన్ని ప్రసారం చేయని సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఆయన అభినందించారు. ప్రస్తుతం జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. కాగా, సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురు మహిళా జడ్జిలున్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే