కేంద్రం తప్పనిసరి కోవిడ్ ప్రోటోకాల్స్ జారీ చేయాలి.. వాటినందరూ పాటించాలి : భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఆప్ సూచన
కరోనాను ముందుగానే నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్స్ ను రూపొందించాలని, వాటిని ప్రతీ ఒక్కరూ పాటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా అన్నారు. భారత్ జోడో యాత్రను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి కేంద్రం తప్పనిసరి ప్రోటోకాల్స్ జారీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. వాటిని అందరూ పాటించాలని తెలిపింది. రాజకీయ పార్టీ అయినా లేకపోతే పాదయాత్ర చేస్తున్నా ఎవరైనా సరే వాటిన కచ్చితంగా పాటించాలని పేర్కొంది. భారత్ జోడో యాత్రను ఉద్దేశించి పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపడుతోంది. ఈ యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో దేశం ఎదుర్కొన్న పరిస్థితులను నివారించడానికి కేంద్రం తప్పనిసరి ప్రోటోకాల్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రాథమిక శాస్త్రీయ సూచనల తీవ్రతను అర్థం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు. అందుకే కోవిడ్ -19 మహమ్మారి రెండు వేవ్ లలో దేశం పెద్ద సంక్షోభాన్ని చవిచూసిందని ఆయన ఆరోపించారు. ‘కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి తప్పనిసరి ప్రోటోకాల్స్ జారీ చేయలేదని నాకు తెలుసు. ప్రోటోకాల్స్ జారీ చేస్తే వాటిని ప్రతి ఒక్కరూ వాటిని గౌరవించాలి. అనుసరించాలి. రాజకీయ పార్టీ అయినా, యాత్ర చేపడుతున్న వారు అయినా సరే వాటిని పాటించాలి’’ అని ఆయన అన్నారు.
చైనా నుంచి నేరుగా లేదా పరోక్షంగా వచ్చే భారత్ కు ప్రయాణికులతో వచ్చే అన్ని విమానాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని, అవసరమైతే దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా వాటిని నిషేధించాలని రాఘవ్ చద్దా అన్నారు. కరోనా వచ్చిన తరువాత నివారించడం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమమని అన్నారు.
కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర‘ ను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా ఈ వారం ప్రారంభంలో రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. రాజస్థాన్ కు చెందిన ముగ్గురు ఎంపీలు భారత్ జోడో యాత్రపై ఆందోళనలు లేవనెత్తారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. శానిటైజర్ల వాడకంతో పాటు కోవిడ్ ప్రొటో కాల్ ను ఖచ్చితంగా పాటించాలని, టీకాలు వేసిన వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రెగ్నెంట్ స్టూడెంట్లకు 60 రోజుల మెటర్నిటీ సెలవులు.. కేరళ యూనివర్సిటీ సంచలన నిర్ణయం
ఈ లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. అధికార పార్టీ (బీజేపీ) దేశంలో ఎన్నైనా బహిరంగ సభలు నిర్వహిస్తుందని, కానీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న చోట మాత్రమే కోవిడ్ ను చూస్తోందని తెలిపారు. ఈ యాత్రను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం సాకులు చెబుతూ ముందుకు వస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర ముందుకు సాగకుండా ఏదీ అడ్డుకోజాలదని, కోవిడ్ మహమ్మారి ముసుగులో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.