మత మార్పిడిలు ఆపడానికి అక్రమ చర్చిలను బుల్డోజ్ చేయండి - శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్
బలవంతంగా హిందువులను క్రైస్తవమతంలోకి మార్చే చర్చిలను బుల్డోజర్ తో కూల్చేయాలని శ్రీరామ్ సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. దీని కోసం ఒక చట్టం తేవాలని చెప్పారు. ఇలా బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతున్న చర్చిల లిస్ట్ తాను తయారు చేసి ఇస్తానని తెలిపారు.
కర్నాటక రాష్ట్రంలో లౌడ్ స్పీకర్లలోహనుమాన్ చాలీసా, సుప్రభాతం ప్లే చేస్తున్నందుకు శ్రీరామ్ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్న అతి కొద్ది రోజుల తరువాత ఆ సంఘం చీఫ్ చర్చిలపై వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. ఇలాంటి అక్రమ చర్చిలను బుల్డోజర్తో కూల్చివేసేలా చట్టం తేవాలని ఆయన శుక్రవారం డిమాండ్ చేశారు.
“ ప్రతిరోజూ వేలమంది హిందువులు క్రైస్తవులుగా మార్చబడుతున్నారు. వారిని బలవంతంగా, మోసం చేసి మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు దీనిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం ఉంది. చట్టవిరుద్ధమైన చర్చిలను బుల్డోజ్ చేయాలి. వాటిని కూల్చడానికి కఠినమైన చట్టం తీసుకురావాలి. అలాంటి చట్ట విరుద్ధమైన చర్చిలు ఉన్నాయి. వాటి లిస్ట్ నేను తయారు చేస్తాను. వాటిని బుల్డోజ్ చేయాలి ’’ అని ప్రమోద్ ముతాలిక్ కన్నడలో ప్రసంగించారు.
కొన్ని రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలని సీఎం బసవరాజ్ బొమ్మైకి ఈ శ్రీరామ్ సేన సంస్థ అల్టిమేటం ఇచ్చింది. అయితే మే 9వ తేదీన లౌడ్ స్పీకర్లలో అజాన్ను అడ్డుకునేందుకు ఆ సంస్థ కార్యకర్తలు హనుమాన్ చాలీసా, సుప్రభాతం ప్లే చేశారు. దీంతో ఆ సంస్థ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘‘ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వం, ముస్లిం సమాజంపై మేము ప్రచారాన్ని ప్రారంభించాం. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన డిప్యూటీ కమిషనర్లందరిపై ధిక్కార కేసు నమోదు చేస్తాం’’ అని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తో శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ తెలిపారు.
కశ్మీరీ పండిట్లను బలిపశువు చేస్తున్నారు.. కేంద్రంపై టెర్రరిస్టులు చంపిన కశ్మీర్ పండిట్ భార్య ఫైర్
అయితే లౌడ్ స్పీకర్లపై దశలవారీగా చర్యలు తీసుకుంటామని బొమ్మై హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. 15 రోజుల్లోగా లౌడ్ స్పీకర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు బొమ్మై లేఖ రాశారు.
కాగా.. శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2021 ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే గా జరుపుకోకూడదని, దీనిని మాతా పిత పూజా దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో కర్ణాటకలో సాగే అసభ్య కార్యక్రమాలను నిర్వహించకుండా ఆపుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తల నిఘా ఉంటుందని తెలిపారు. కాగా 2009లో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆ సంస్థ నాయకులు పబ్ లో వాలంటైన్స్ డే డ్యాన్సులు చేస్తున్న యువతి, యువకులపై దాడి చేశారు. 2018లో కూడా ఆ సంస్జ సభ్యులు ఇలాంటి ఘటనకే పాల్పడితే దీనికి కారణం ప్రమోద్ ముతాలికే అంటూ అతడిని పోలీసులు అరెస్టు చేశారు.