28 ఏళ్ల కింది రేప్ కేసులో అన్న, తమ్ముడు అరెస్టు.. అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్లో 28 ఏళ్ల కిందటి రేప్ కేసులో ఇద్దరు అన్నదమ్ములు అరెస్టు అయ్యారు. 1994లో ఓ మైనర్ బాలికపై పలుమార్లు వారు లైంగికదాడికి పాల్పడ్డరు. ఆ బాలిక బాబుకు జన్మనిచ్చింది. భర్త వదిలిపెట్టిన తర్వాత తాజాగా, బాధితురాలు కేసు పెట్టింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో 28 ఏళ్ల క్రితం జరిగిన నేరంపై ఇటీవలే కేసు నమోదైంది. 28 ఏళ్ల కిందటి రేప్ కేసులో అన్నా తమ్ముడు అరెస్టు అయ్యారు. ఈ ఘటన షాజహాన్పుర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో గుడ్డు, నాకి హసన్ అనే ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. గుడ్డు గత వారం అరెస్టు కాగా, నాకి హసన్ను బుధవారం అరెస్టు చేశారు.
షాజహాన్పుర్లోని సదర్ బజార్ పోలీసు స్టేషన్ ఏరియాలో 1994 ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక నివసించేది. ఆమె ఇంట్లో ఒంటిగా ఉన్నప్పుడు గుడ్డు, నాకి హసన్ పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. బాబును తమ బంధువులకు ఇచ్చింది. ఆమె పెళ్లి చేసుకుంది. కానీ, ఈ అబద్ధం ఎంతో కాలం నిలువలేదు. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఈ విషయం తెలిసిపోయింది. తనను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆ అమ్మాయికి ఓ బాబు జన్మించాడని తెలుసుకున్నాడు. ఆమె గ్యాంగ్ రేప్నకు గురైందని తెలిసింది. దీంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ పరిణామాల తర్వాత 1994 నాటి గ్యాంగ్ రేప్పై మార్చి 4న కేసు నమోదైంది. సదర్ బజార్ పోలీసు స్టేషన్లో ఈ కేసు ఫైల్ అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాకి హసన్, గుడ్డులు, బాధితురాలు, ఆమె జన్మనిచ్చిన బాబులకు డీఎన్ఏ టెస్టు చేయాలని పోలీసులు భావించారు. ఈ విషయాన్నే వారికి ఆదేశించారు.
ఈ కేసు నమోదైన కొన్ని నెలల తర్వాత నిందితులు పరారైనట్టు ఎస్పీ (సిటీ) సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్కు పారిపోయి అక్కడ తలదాచుకున్నారని వివరించారు. గుడ్డును గత వారం అరెస్టు చేశామని చెప్పారు. నాకి హసన్ పరారయ్యాడని తెలిపారు. కానీ, తాజాగా, బుధవారం ఆయనను కూడా అరెస్టు చేసినట్టు వివరించారు. స్థానిక ఇంటెలిజెన్స్, మొబైల్ సర్వెలెన్స్ ద్వారా ఆయన ఆచూకి కనుగొన్నట్టు పేర్కొన్నారు. వారిద్దరినీ జ్యూడిషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు.