సరిహద్దు వివాదం.. మహారాష్ట్ర అసెంబ్లీ వెలుపల సరికొత్తగా నిరసన తెలిపిన ప్రతిపక్షం.. ఏం చేశారంటే ?
మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంపై షిండే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బయట భజన పాటలు పాడారు. ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్పూర్లోని విధాన్ భవన్ మెట్ల మీద కొత్తగా నిరసనలు తెలిపారు. సాధారణం ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపిస్తుంది. కానీ ఇక్కడి ఎమ్మెల్యేలంతా తబలలు, తాళాలు చేతబట్టి భజన పాటలు పాడారు. ఆ పాటలకు తగ్గట్టు డ్యాన్స్ లు చేశారు. ఆ పాటల్లోనే రాష్ట్ర మంత్రులు అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతక విజేతలకు డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు: మధ్యప్రదేశ్
కాగా.. కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘ ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో సరిహద్దు వివాదంపై తీర్మానాన్ని ప్రవేశపెడతారు. మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందుతుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
వివాదాస్పద ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన మాజీ సీఎం, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత ఉద్ధవ్ ఠాక్రేపై కూడా ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. ‘‘నిన్న మాట్లాడిన వారు (ఉద్దవ్ ఠాక్రే) 2.5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. కానీ ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడం పట్ల నాకు ఆశ్చర్యం వేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు వివాదం ప్రారంభం కాలేదు ’’ అని ఫడ్నవీస్ తెలిపారు.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వ నాయకులు షిండే ప్రభుత్వాన్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ ఈ వివాదం మహారాష్ట్ర, భాషల వారీగా ప్రావిన్సుల ఏర్పాటుతో మొదలై.. ఏళ్ల తరబడి సాగుతోంది.. ఆ తర్వాత ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు ఉన్న వాళ్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే సరిహద్దు వివాదం మొదలైందని చూపిస్తున్నారు.. ఈ విధంగా రాజకీయాలు సరిహద్దు వివాదంపై ఎప్పుడూ జరగలేదు. మరాఠీ మాట్లాడే ప్రజల ప్రశ్న కాబట్టి మేము ప్రతిసారీ ప్రభుత్వంతో నిలబడతాము" అని ఫడ్నవీస్ అన్నారు.
ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ‘‘ మేము ఈ అంశంపై ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. దీనిపై ఎవరూ రాజకీయాలు చేయరని మేము ఆశిస్తున్నాము. సరిహద్దు ప్రాంతాల ప్రజలు మొత్తం మహారాష్ట్ర తమతో ఉన్నారని భావించాలి’’ అని ఫడ్నవీస్ అన్నారు.