Bombay High Court: ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు విద్యార్థిని అరెస్ట్ చేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
Bombay High Court: ఆపరేషన్ సింధూర్పై విమర్శనాత్మక సోషల్ మీడియాలో పోస్టు చేసిన 19 ఏళ్ల విద్యార్థినిని మహా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పుణెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఖదీజా షేక్కు బెయిల్ మంజూరు చేస్తూ, ఆమెను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ గౌరీ, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ల బెంచ్.. “ఇది పూర్తిగా షాకింగ్ కలిగించే విషయం. విద్యార్ధినిని గుండాల చూసారు. పోలీసులే ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నట్టు ఉంది” అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
విద్యార్థిని ప్రస్తుతం పుణె ఎరవాడ సెంట్రల్ జైలులో ఉండగా, ఆమెను మంగళవారం సాయంత్రం వరకు విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కాలేజీ చేసిన రస్టికేషన్ ఉత్తర్వును కూడా కోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆమె పరీక్షల కోసం హాల్ టికెట్ ఇవ్వాలని కాలేజీకి ఆదేశించింది. పోస్ట్ చేసిన వెంటనే విద్యార్థిని దానిని తొలగించిందనీ, క్షమాపణ చెప్పిందని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఆమెను అరెస్ట్ చేయడం తగదు అని వ్యాఖ్యానించింది.
ఈ కేసు ఏంటి? ఏం జరిగింది?
ఖదీజా షేక్, పుణెలోని సింఘఢ్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్లో రెండో సంవత్సరం ఐటీ విద్యార్థిని. ఈ కాలేజీ సావిత్రీబాయి ఫులే పుణె విశ్వవిద్యాలయం అనుబంధంలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థ. మే 7న ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా పోస్టు చేసింది. రెండు గంటలలోపే ఆమె వాటిని తొలగించినా, మే 9న పుణె పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్లు 152, 196, 197, 299, 352, 353 కింద కేసు నమోదు చేయగా, మహారాష్ట్ర ఏటీఎస్, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ సంస్థలు విచారణలో భాగంగా మారాయి. అదేరోజు ఆమె కాలేజీ, ఆమెపై దేశద్రోహ భావాలు ఉన్నాయని పేర్కొంటూ రస్టికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
బాంబే హైకోర్టు విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఒక యువ విద్యార్థిని చేసిన తప్పును అవగాహన చేసుకుని క్షమాపణ చెప్పింది. ఆమెను సరిదిద్దేందుకు కాకుండా, ప్రభుత్వం నేరస్తురాలిగా మలిచింది. ఇలా విద్యార్థులను అరెస్ట్ చేస్తే, వారి అభిప్రాయాలను ఎలా వ్యక్తీకరించగలరు? ఈ చర్యలు వ్యక్తులను మరింత రాడికలైజ్ చేస్తాయి” అని వ్యాఖ్యానించింది.