Ayush Mhatre to lead India U19: ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ యంగ్ ప్లేయ‌ర్ ఆయూష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. 

Ayush Mhatre to lead India U19: భారత అండర్-19 జట్టు 2025 జూన్-జులైలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో ఒక 50 ఓవర్ల వార్మ్-అప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడ‌నుంది. ముంబైకి చెందిన 17 ఏళ్ల యువ ఆటగాడు ఆయుష్ మాత్రే జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. అలాగే, బీహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీకి కూడా భార‌త జూనియ‌ర్ జ‌ట్టులో చోటుద‌క్కింది.

ఈ పర్యటన కోసం ఎంపికైన 16 మంది ఆటగాళ్ల జట్టులో ఆయుష్ మాత్రే కెప్టెన్ కాగా, ముంబైకి చెందిన వికెట్‌ కీపర్ అభిజ్ఞాన్ కుండూ వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. పంజాబ్‌కి చెందిన విహాన్ మల్హోత్రా, సౌరాష్ట్రకు చెందిన హర్వన్ష్ పంగళియా, బెంగాల్ పేసర్ యుధాజిత్ గుహా, కేరళ లెగ్‌స్పిన్నర్ మొహమ్మద్ ఎనాన్, పంజాబ్ ఆఫ్‌స్పిన్నర్ అన్మోల్జీత్ సింగ్ వంటి యువ క్రికెటర్లు కూడా జట్టులో ఉన్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన గుజరాత్ ఆల్‌రౌండర్ ఖిలాన్ పటేల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇత‌ను స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ అద‌ర‌గొట్టే ప్లేయ‌ర్.

భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు ఇదే

ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభ‌వ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావడా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుండూ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), హర్వన్ష్ పంగళియా (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ఆటగాళ్లు: నమన్ పుష్పక్, డి దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలు (వికెట్ కీపర్)

ఇంగ్లాండ్ లో భాత‌ర జ‌ట్టు పర్యటన షెడ్యూల్:

జూన్ 24: వార్మ్-అప్ మ్యాచ్

వన్డే మ్యాచ్ లు:

జూన్ 27 - హోవ్

జూన్ 30 - నార్తాంప్టన్

జూలై 2 - నార్తాంప్టన్

జూలై 5 - వోర్సెస్టర్

జూలై 7 - వోర్సెస్టర్

టెస్టు మ్యాచ్‌లు:

మొదటి టెస్ట్: జూలై 15-18 - బెకెన్హామ్

రెండో టెస్ట్: జూలై 20-23 - చెల్మ్స్‌ఫోర్డ్ 

ఆయూష్ మాత్రే ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్‌ల్లో 206 పరుగులు (సగటు 34.33, స్ట్రైక్ రేట్ 187.27) చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున సూర్యవంశీ 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు (సగటు 36.00), ఇందులో ఒక సెంచ‌రీతో పాటు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

మాత్రే గతంలో ముంబై అండర్-16 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను విరార్ ప్రాంతానికి చెందినవాడు. ఇక్కడి నుంచి పృథ్వీ షా కూడా వచ్చాడు. షా 2018లో అండర్-19 వరల్డ్ కప్‌ను గెలిపించాడు.

జాతీయ జూనియర్ సెలెక్షన్ కమిటీ

జట్టును థిలక్ నేతృత్వంలోని జూనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియాలో జరగనున్న 2026 అండర్-19 వరల్డ్ కప్ కోసం ఈ జట్టును కొన‌సాగించే అవ‌కాశ‌ముంది.