కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన బీజేపీ

జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ బంధానికి బీటలు వారాయి.. సంకీర్ణ ప్రభుత్వంలోప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. పీడీపీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తున్న కశ్మీర్ ఏ క్షణమైనా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తున్న ఊహాగానాలకు ఇవాళ తెరపడింది.. పీడీపీతో కలిసి నడవాలా వద్దా అన్న దానిపై కశ్మీర్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగరాదని వారు చెప్పడంతో.. పీడీపీతో తెగదెంపులు చేసుకోవాలని షా నిర్ణయించారు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆయన నిర్ణయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఢిల్లీలో మీడియాకు వివరించారు. పీడీపీతో స్థిరమైన ప్రభుత్వాన్ని, పాలనను అందించలేమని భావించినందున జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో తీవ్రవాదం, హింస, వేర్పాటువాదం పెచ్చుమీరాయని.. ప్రజల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని.. అందుకు సుజాత్ బుకారీ హత్య ఒక నిదర్శనమని రాం మాధవ్ అన్నారు.

మరోవైపు ప్రభుత్వం నుంచి వైదొలుగున్నట్లు తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడిన తక్షణం వారు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసి తమ రాజీనామాలు సమర్పించారు.