బిహార్ బీజేపీ యూనిట్ చీఫ్ సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. ఒసామా బిన్ లాడెన్ తరహా ఆయన గడ్డం పెంచుకున్నారని పేర్కొన్నారు.
పాట్నా: బిహార్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ సామ్రాట్ చౌదరి శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీని మరణించిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. అలా గడ్డం పెంచి నరేంద్ర మోడీలా మారాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
బిహార్లో అరేరియా జిల్లాలో ఓ ర్యాలీలో సామ్రాట్ చౌదరి మాట్లాడారు. ‘కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఒసామా బిన్ లాడెన్ తరహా గడ్డం పెంచుతున్నాడు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీలా అవుదామని అనుకుంటున్నాడు’ అని అన్నారు.
Also Read:కాంప్రమైజ్ కావాలని మాపై ఒత్తిడి.. మహిళా రెజ్లర్కు పోలీసులు అబద్ధం చెప్పారు: రెజ్లర్లు
భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గడ్డం తీసుకోలేదు. అయితే, భారత్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత గడ్డం తీసుకున్నారు.
ఆ బీజేపీ నేత రాహుల్ గాంధీతోపాటు బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైనా విమర్శలు చేశారు. ‘నితీశ్ కుమార్ దేశమంతా తిరుగుతున్నారు. ఈ దేశానికి తానే ప్రధానమంత్రి కాబోతున్నారని చెబుతున్నారు. నిజంగా నితీశ్ కుమార్ ప్రధాని అవుతాడా?’ అని చౌదరి ర్యాలీకి హాజరైన ప్రజలను అడిగారు. నితీశ్ కుమార్కు మానసిక ఆరోగ్యం చెడిందని, ఆయన అమిర్ ఖాన్ సినిమాలోని ఘజినీలా ఉన్నాడని పేర్కొన్నారు.
గతంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘నేను రాహుల్ గాంధీ లుక్ గురించి ఏమీ మాట్లాడను. కానీ, చాలా సార్లు చెప్పిందిదే.. నీ ముఖం రాను రాను సద్దాం హుస్సేన్లా మారిపోతున్నది. కానీ, ఒక వేళ నీవు గడ్డం తీసుకుంటే మాత్రం నీ ముఖం నెహ్రూలా కనిపిస్తుంది’ అని అన్నారు.
