లులు మాల్ ను శుద్ధీకరణ చేస్తానంటూ వచ్చిన అయోధ్య సాధును పోలీసులు అరెస్టు చేశారు. ఆ సాధువు లోపలికి వెళ్లి శుద్ధీకరణ ప్రక్రియ మొదలు పెట్టబోతుండగా పోలీసులు వేగంగా వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌క్నో సిటీలో వెలుగులోకి వ‌చ్చిన లులు మాల్ న‌మాజ్ వివాదం ఇంకా చ‌ల్లార‌డం లేదు. తాజాగా లులు మాల్ ను శుద్ధీక‌ర‌ణ చేస్తానంటూ వ‌చ్చిన ఓ సాధువును పోలీసులు అరెస్టు చేశారు. అయోధ్యలోని తపస్వీ చావ్నీకి చెందిన స్వామి పరమహంస్‌ను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో మాల్ స‌మీపంలోకి చేరుకున్నారు. ఆయ‌న లోప‌లికి ప్ర‌వేశించి ‘శుద్ధీకరణ’ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వేగంగా పరిగెత్తి ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంట‌నే పోలీసు వ్యాన్ లో ఆ సాధువును అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఇదంతా కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. 

అస‌లేంటీ వివాదం..
యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ ఎంఏ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న లులు మాల్ ను జూలై 10వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోలో లులు మాల్ ప్రాంగ‌ణంలో ఎనిమిది మంది వ్యక్తులు నమాజ్ చేసారు. ఈ వీడియోపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ మాల్ లో తాము కూడా హనుమాన్ చాలీసా, సుంద‌రాఖండ ప‌ఠిస్తామ‌ని హెచ్చ‌రించాయి. సోష‌ల్ మీడియాలో కూడా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో మేనేజ్ మెంట్ స్పందించింది. న‌మాజ్ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. 

Nupur Sharma: నూపుర్ శర్మ హ‌త్య‌కు భారీ కుట్ర‌.. అక్ర‌మంగా స‌రిహ‌ద్దు దాటిన పాక్ నిందితుడు.. .

కాగా లులు మాల్ లో న‌మాజ్ చేసిన వారిలో ముస్లిమేత‌రులు ఉన్నారంటూ మ‌రో కొత్త అంశం లోక‌ల్ మీడియాలో ప్ర‌సారం అయ్యింది. దీనిపై క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ల‌క్నో పోలీసులు సోమ‌వారం స్పందించారు. అందులో ముస్లిమేత‌రులు ఎవ‌రూ లేర‌ని తేల్చి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిపై జూలై 16వ తేదీన కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం, సామరస్యానికి భంగం కలిగించేలా నినాదాలు చేసినందుకు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.  

లులు మాల్ పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆ సంస్జ మ‌రో సారి స్పందించాల్సి వ‌చ్చింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ‘‘ కొన్ని స్వార్థ ప్రయోజనాలు మా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించడం బాధాకరం. మాకు ఇక్క‌డ ఉన్న అంద‌రు కార్మికులు స్థానికులే. వీరిలో 80 శాతానికి పైగా హిందువులు. మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మా ఉద్యోగులంద‌రినీ స్కిల్, మెరిట్ ఆధారంగా నియ‌మించుకున్నాం. అంతే గాని కులం, మతం ఆధారంగా కాదు. మా స్థాపనలో మతపరమైన కార్యకలాపాలు నిర్వ హించడానికి ఎవరికీ అనుమతి లేదు. బహిరంగ ప్రదేశంలో ప్రార్థనలు, చేసేందుకు ప్రయత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేనేజ్ మెంట్ చ‌ర్య‌లు తీసుకుంది. స్వార్థ ప్రయోజనాలతో మా వ్యాపార సంస్థను లక్ష్యంగా చేసుకోకండి.’’ అని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

Heavy Rains: కేర‌ళ‌లో 23 వ‌రకు భారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఈరోజు వ్యాఖ్యానించారు. లులు మాల్ వివాదంపై అధికారులు సీరియ‌స్ గా దృష్టి నిల‌పాల‌ని అన్నారు. కొంద‌రు కావాల‌ని ఆ మాల్ కు న‌ష్టం చేకూర్చాల‌ని ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌ల‌ను ఇస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారులతో జ‌రిగిన వీడియో కాన్ష‌రెన్స్ లో సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు.