ప్రజలను ఫూల్స్ చేయడం మానుకోండి... ఇంధన ధరల తగ్గింపు నిర్ణయంపై రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఫూల్స్ ను చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోల్, డీజిల్ పై ధరలను పెంచి ఇప్పుడు తగ్గించారని తెలిపారు. 2020 మే 21వ తేదీన పెట్రోల్ ధర రూ. 69 గా ఉందని, అదే తేదీన ఈ సంవత్సరం లీటర్ పెట్రోల్ 105.4గా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య ప్రజలకు నిజమైన ఉపశమనం కావాలంటే మరిన్ని కోతలు కావాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆదివారం వ్యాఖ్యలు చేశారు.
రికార్డు ద్రవ్యోల్బణం నుంచి నిజమైన ఉపశమనం పొందేందుకు ప్రజలు అర్హులని అన్నారు. కాబట్టి పౌరులను మోసం చేయడం మానుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. దీని ప్రకారం పెట్రోల్ ధర 2020 మే 21వ తేదీన రూ.69గా ఉండగా.. 2022 మే 21వ తేదీన పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.4 కు పెరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ బల్లావ్ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ధరలను నిరంతరం పెంచుతూ లబ్ధి పొందుతున్న ప్రభుత్వం ఇప్పుడు ధరలు తగ్గించి ప్రజల కళ్లలో దుమ్మురేపే పని చేస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలను మోసం చేసే పని ప్రభుత్వం చేసిందన్నారు. ధరలు తగ్గించడం ద్వారా కూడా ప్రభుత్వం ప్రజల నుంచి రెట్టింపు డబ్బు వసూలు చేస్తోందని ఆరోపించారు. పెట్రోలు లీటర్పై రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున తగ్గించడం ద్వారా ప్రభుత్వం తన లాభాన్ని రెండింతలు తగ్గించుకోలేదని అన్నారు. 2014లో ఉన్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధర నేడు దాదాపు రెండింతలు పెరిగిందని ఆయన అన్నారు. గత 60 రోజులుగా పెట్రోలు-డీజిల్పై నిరంతరాయంగా పెరుగుతూనే ఉందని తెలిపారు.
తమిళనాడులో దారుణం.. భార్య అనుకొని నిద్రిస్తున్న మరో మహిళను..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 ధర తగ్గుతుందని ఆమె తెలిఆరు. దీని వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 1 లక్ష కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అన్నారు. కాగా ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగిపోవడంతో ఇంధనంపై కేంద్ర పన్నుల్లో కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం ఇది రెండోసారి. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ప్రజలకు ఉపశమనం కలిగించడానికి వ్యాట్ తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కూడా కోరింది.
భారత విదేశాంగ విధానం భేష్.. అమెరికాకు కూడా తలొగ్గడం లేదు - పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
అయితే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మాకు ఎప్పుడూ ప్రజలే ప్రథమం.. పెట్రోల్, డీజిల్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు సంబంధించిన నేటి నిర్ణయం వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయి. మన పౌరులకు ఉపశమనం, మరింత సౌలభ్యం కలిగిస్తాయి. ’’ అని మోడీ ట్వీట్ చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఉజ్వల యోజన కోట్లాది మంది భారతీయులకు ముఖ్యంగా మహిళలకు సహాయంగా ఉంటోంది. ఉజ్వల సబ్సిడీపై ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబ బడ్జెట్లపై చాలా ప్రభావం చూపుతాయి. ’’ అని ఆయన అన్నారు.