ఇండియాలో కూడా కోవిడ్-19 టాబ్లెట్.. త్వరలోనే మోల్నుపిరవిర్ అత్యవసరం వినియోగానికి అనుమతి..!
కరోనా లక్షణాలు ఉన్నవారి చికిత్స కోసం తయారుచేసిన మోల్నుపిరవిర్ (Molnupiravir) టాబ్లెట్కు ఇటీవల బ్రిటన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. భారత్లోనూ తొందరలోనే మోల్నూపిరావర్ మాత్రను అత్యవసర వినియోగం కింద అనుమతించే (Emergency Use Authorisation) అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినా.. ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. మరోవైపు దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా లక్షణాలు ఉన్నవారి చికిత్స కోసం తయారుచేసిన మోల్నుపిరవిర్ (Molnupiravir) టాబ్లెట్కు ఇటీవల బ్రిటన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ యాంటీ వైరల్ టాబ్లెట్ను అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేశాయి. కరోనా సోకి బలహీనంగా ఉన్న రోగులకు మోల్నుపిరవిర్ మాత్రలు వాడాల్సి ఉంటుంది.
అయితే తాజాగా భారత్లోనూ తొందరలోనే మోల్నుపిరవిర్ మాత్రను అత్యవసర వినియోగం కింద అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మితమైన COVID-19 లక్షణాలు ఉన్నవారి చికిత్స కోసం వినియోగించే.. యాంటివైరల్ మోల్నుపిరవిర్ జౌషధానికి కొద్ది రోజుల్లోనే అత్యవసర వినియోగ అనుమతి లభించనుందని సీఎస్ఐఆర్ కోవిడ్ స్ట్రాటజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామ్ విశ్వకర్మ బుధవారం చెప్పినట్టుగా ఎన్డ్టీవీ పేర్కొంది.
Also read: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు: నిన్నటి కంటే 14 శాతం కేసుల పెరుగుదల
ఫైజర్ (Pfizer) అభివృద్ది చేస్తున్న యాంటివైరల్ మాత్ర Paxlovid అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని ఆయన అన్నారు. ఈ రెండు మందులు ఒక వైవిధ్యాన్ని కలిగిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ఎండెమిక్(ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి)గా మారుతున్న సమయంలో టీకా కంటే ఇవి చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు.
‘మోల్నుపిరవిర్ ఇప్పటికే మనకు అందుబాటులో ఉంటుందని నేను భావిస్తున్నాను.. ఐదు కంపెనీలు డ్రగ్ తయారీదారుతో చర్చలు జరుపుతున్నాయి.. ఏ రోజైనా ఆమోదం లభిస్తుందని నేను భావిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ‘UK రెగ్యులేటర్ ఆమోదానికి ముందు మోల్నుపిరావిర్ డేటాను ఇక్కడ రెగ్యులేటరీ పరిశీలనకు పంపారు. ఇప్పటికే ఇక్కడి SECలు దీనిని చూస్తున్నాయి. అందుకే వేగంగా ఆమోదం పొందుతుందని నేను భావిస్తున్నాను. అందువల్ల వచ్చే ఒక నెలలోగా మెర్క్ ఔషధానికి ఆమోదంపై నిర్ణయం ఉంటుందని చెప్పడం సరైనది’ అని ఆయన చెప్పారు.
ఇక, ఫైజర్ అభివృద్ది చేస్తున్న పాక్స్లొవిడ్ గురించి ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఓ వ్యక్తిలోకి వైరస్ వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి కరోనా సోకకుండా ఈ డ్రగ్ అడ్డుకట్ట వేయగలదని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఈ టాబ్లెట్ సమర్థంగా పని చేస్తుందని తేలితే.. ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి రానుంది.