పాకిస్తాన్ సరిహద్దుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాత్రి బస అక్కడే..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లారు. సరిహద్దులోని రోహితాష్ మిలిటరీ ఔట్పోస్టును సందర్శించారు. అక్కడ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లతో ఆయన మాట్లాడారు. ఈ రోజు రాత్రి సరిహద్దులో సైన్యం చేపట్టే పెట్రోలింగ్ను ఆయన పరిశీలించనున్నారు. అలాగే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)తోనే ఆయన ఈ రోజు రాత్రి ఉండనున్నారు. అంతేకాదు, సైనికులతోనే ఆయన డిన్నర్ చేశారు.
జైపూర్: తరుచూ భారత్(India)తో కయ్యానికి దిగే Pakistan సరిహద్దు(Border)లో ఎప్పుడూ ఏదో జిత్తులమారి ఎత్తులు వేస్తుంటుంది. ఉన్నట్టుండి భారత జవాన్ల(Indian Army)పై షెల్లింగ్ మోర్టార్లను కురిపిస్తుంది. లేదా ఉగ్రవాదులను ఆ సరిహద్దు గుండా మన దేశంలోకి పంపిస్తూ ఉంటుంది. అందుకే భారత్, సరిహద్దులో ఎప్పుడూ ఏదో ఉద్రిక్తత ఉన్నట్టే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. కానీ, ఇటీవలే కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సయోధ్య ఇప్పుడు సరిహద్దులో కొంత శాంతిని తెచ్చినట్టు కనిపిస్తున్నది. అయితే, ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) సెన్సిటివ్గా ఉండే భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లారు. ఇండో-పాక్ సరిహద్దులోని రొహితాష్ మిలిటరీ ఔట్పోస్టుకు ఆయన వెళ్లారు.
ఆ రొహితాష్ రీజియన్లో సరిహద్దు వెంట పహరా కాస్తున్న జవాన్లన ఆయన కలిశారు. వారితో ముచ్చటించారు. అనంతరం సైనికులతో ఆయన భోజనం చేశారు. ఈ రోజు రాత్రి ఆయన సరిహద్దులో ఆర్మీ పెట్రోలింగ్ను దగ్గర ఉండి పరిశీలించనున్నారు. మీరంతా సరిహద్దులో కాపలా కాస్తున్నందే తనతోపాటు 130 కోట్ల మంది భారతీయులు రాత్రి నిశ్చింతగా పడుకుంటున్నారని వివరించారు. ఎందుకంటే ప్రతి భారతీయుడికీ ఆర్మీపై బలమైన నమ్మకం ఉన్నదని తెలిపారు. కాగా, ఇదే పర్యటనలో ఆయన మరో కీలక ప్రకటన చేశారు. సైనికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సముచిత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పతకాన్ని ఇకపై నుంచి ఆర్మీకి వర్తింపజేస్తామని వెల్లడించారు.
Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్లకూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆర్మీకి, వారి కుటుంబాలకు ప్రత్యేక ఆయుష్మాన్ కార్డును అందిస్తామని తెలిపారు. కాబట్టి, అటు తర్వాత ప్రతి సైనికుడు, వారి కుటుంబం ఆయుష్మాన్ కార్డు ద్వారా హాస్పిటల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చునని వివరించారు. రొహితాష్ ఔట్పోస్టు రాజస్తాన్కు చెందిన జైసల్మేర్ సరిహద్దులో ఉన్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లారు.
కాగా, రాజస్తాన్లోని బీజేపీ యూనిట్లో అంతర్గత విభేదాలు రచ్చకు ఎక్కిన తరుణంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రం పర్యటించడం గమనార్హం. రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సతీష్ పూనియా మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం వసుంధర రాజే తన బలాన్ని వెల్లడించడానికి ప్రత్యేకంగా యాత్ర చేపట్టారు. ఆమె రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పర్యటించి కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆయా జిల్లాల్లోని ఆలయాలను సందర్శించారు. ఆమె పర్యటనపై పలువురు చేసిన విమర్శలకు సమాధానంగా ఆమె దీటైన జవాబిచ్చారు. తనది కేవలం రాజకీయ పర్యటన అనే వారు జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర హోం మంత్రి తన పర్యటనలో వీరిద్దరి మధ్య గొడవను సద్దుమణిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం జైపూర్ పర్యటించి పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇక్కడే వారిద్దరి మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.