చైనా నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? : కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. గాల్వాన్లో భారత సైనికులు చనిపోయినప్పుడు చైనా దౌత్యవేత్తలకు విందు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు సైనికులు గాయపడినట్టుగా నివేదికలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని అధికార బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన అమిత్ షా.. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్పై ఒక ప్రశ్న జాబితా చేయబడినప్పటీ నుంచి కాంగ్రెస్ ఎంపీలు ఉద్దేశపూర్వకంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అంతరాయం కలిగించారని అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యొక్క ఎఫ్సిఆర్ఎ రద్దుపై ప్రశ్నను నివారించడానికి కాంగ్రెస్ పార్లమెంటులో సరిహద్దు సమస్యను లేవనెత్తిందని విమర్శించారు. తాము ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.
2005 నుంచి 2007 మధ్యా కాలంలో చైనా రాయబార కార్యాలయం ద్వారా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేయబడిందని ఆరోపించారు. ఇది ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రాకారం లేనందున రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిందని అన్నారు. చైనా నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారని కాంగ్రెస్ను ప్రశ్నించారు. నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ వల్లనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత స్థానం దక్కకుండా పోయిందని అన్నారు.
‘‘నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమానికి నేను వందనం చేస్తున్నాను’’అని అమిత్ షా పేర్కొన్నారు.