ఉద్ధవ్ ఠాక్రే టీమ్, కాంగ్రెస్కు మధ్య సయోద్య! భారత్ జోడో యాత్ర విశేష స్పందన అంటూ సంజయ్ రౌత్ ట్వీట్
ఉద్ధవ్ ఠాక్రే టీమ్, కాంగ్రెస్కు మధ్య మళ్ల సఖ్యత కుదిరినట్టు తెలుస్తున్నది. సావర్కర్ పై రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తరుణంలో ఎంవీఏ కూటమి నుంచి వైదొలుగుతామనే సంకేతాలను ఉద్ధవ్ శివసేన వర్గం సంకేతాలు ఇచ్చింది. ఈ తరుణంలో సంజయ్ రౌత్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ముంబయి: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటించినప్పుడు సావర్కర్ పై ఘాటుగా విమర్శలు చేశారు. బ్రిటీషర్లకు సావర్కర్ రాసిన లేఖ నకలును మీడియాకు చూపిస్తూ ఫైర్ అయ్యారు. బ్రిటీషర్లకు లొంగి ఉన్నాడని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో కలకలం రేపాయి. కాంగ్రెస్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే టీమ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన వర్గం.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గంపై విమర్శలు సంధించింది. రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కూడా ఖండించింది. ఒకానొక దశలో ఏంవీఏ కూటమి (శివసేన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి) కి కటీఫ్ చెప్పేదాకా పరిస్థితులు వెళ్లాయి. అలాంటి సంకేతాలు కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి బయటకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం మధ్య సయోద్య కుదిరినట్టు తెలుస్తున్నది. అంతా సఖ్యంగానే ఉన్నదన్నట్టుగా తాజాగా శివసేన ఉద్ధవ్ టీమ్ లీడర్ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. అంతేకాదు, రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తున్నదని పొగిడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు.
Also Read: కాంగ్రెస్తో కటీఫ్! సావర్కర్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉద్ధవ్ టీమ్ అప్సెట్
కొన్ని విషయాల్లో మా మధ్య తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ ఒక రాజకీయ సహచరుడి ఆరోగ్య వివరాలను ఆరా తీయడం నిజంగా మానవత్వానికి ప్రతీక అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఆయన షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్నదని, అయినప్పటికీ ఆయన నిన్న ఫోన్ చేసిన ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలిపారు. ‘నీ గురించి ఆందోళన చెందాం’ అని ఆయన పేర్కొన్నారని వివరించారు.
110 రోజులు జైలులో గడిపిన ఒక రాజకీయ సహచరుడి బాధను అర్థం చేసుకునే ఆయన సహృదయతను ప్రశంసిస్తున్నానంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రాజకీయ కఠిన వాతావరణంలో ఇలాంటి పలకరింపులు అరుదు అని అభిప్రాయపడ్డారు. కానీ, రాహుల్ గాంధీ ప్రేమ, దయలను తన యాత్రలో ఎక్కడా మిస్ కానివ్వలేదని, అందుకే ఆయన యాత్రకు విశేష స్పందన లభిస్తున్నదని వివరించారు.
ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కూడా రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయనతో కలిసి అడుగులు వేసిన తర్వాత రాహుల్ గాంధీ విలేకరులతో వీడీ సావర్కర్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.