గత కొంత కాలం నుంచి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరు పట్ల అసంతృప్తిగా మేనమామ శివపాల్ సింగ్ యాదవ్ తాజాగా ఆయనపై విరుచుకుపడ్డారు. అఖిలేష్ రాజకీయ అపరిపక్వతతో ఉన్నారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ పతనానికి అఖిలేష్ యాదవ్ రాజకీయ అపరిపక్వతే కారణం అని ఆ పార్టీ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ ఆరోపించారు. అందుకే పార్టీ బలహీన పడుతోందని, చాలా మంది నాయకులు సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నారని అన్నారు. ‘ పార్టీ సమావేశాలకు నన్ను ఆహ్వానించలేదు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో సమావేశానికి కూడా నన్ను పిలవనేలేదు’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
‘‘ నా సూచనలను (అఖిలేష్ యాదవ్) సీరియస్గా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది, పార్టీకి చెందిన అనేక కూటములు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి.’’ అని అన్నారు. ‘‘నన్ను ఓటు అడిగే వారికి ఓటు వేస్తానని ముందే చెప్పాను. సమాజ్వాదీ పార్టీ కూడా నన్ను పిలవలేదు. నా ఓటు అడగలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్లాను. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యాను. ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. ’’ అని శివపాల్ సింగ్ యాదవ్ తెలిపారు.
బీజేపీ.. ఉగ్ర సంబంధాల బహిర్గతానికి కాంగ్రెస్ దేశవ్యాప్త సమావేశాలు !
జస్వంత్నగర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన శివపాల్ సింగ్ యాదవ్ స్వయంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మేన మామ. గత కొంత కాలంగా ఆయన సమాజ్ వాదీ పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన 2018లో ప్రగతిశీల సమాజ్ వాదీ అనే పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్నితొలగించే ప్రయత్నంలో భాగంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ తో కలిసి నడిచారు. ఆయన కూడా ఎస్పీ టికెట్ పైనే పోటీ చేసి గెలుపొందారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ.. కేడర్కు మూడు రోజుల శిక్షణ
అయితే గతంతో పోలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కొంత మెరుగుపడింది. కానీ బీజేపీని దాటి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో అఖిలేష్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. దీనికి శివపాల్ యాదవ్ ను ఆహ్వానించలేదు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఎస్పీ నుంచి తెగదింపులు చేసునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ ఎన్నికల సమయంలో అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అందులో భాగంగానే భారతీయ సమాజ్ పార్టీ ని కూడా తనతో చేర్చుకున్నారు. కానీ దాని అధ్యక్షుడు ఓపీ రాజ్ భర్ కూడా అఖిలేష్ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూడా కూటమి నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
