మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండు ముక్కలు అయ్యింది. అనంతరం ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి షిండే - బీజేపీ ప్రభుత్వంలో చేరారు. దీంతో శరద్ వవార్ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చూస్తోంది. దీని నుంచి తప్పించుకోవాలంటే అజిత్ పవార్ వర్గానికి మరింత మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఎమ్మెల్యేతో సమావేశం ఏర్పాటు చేశారు. 

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ముంబైలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 35 మంది హాజరయ్యారు. దీంతో ఈ నెంబర్ గేమ్ లో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కంటే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ముందున్నారని తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు - శరద్ పవార్ మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్.. కారణమేంటంటే ?

సబర్బన్ బాంద్రాలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. అయితే అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అజిత్ పవార్ శిబిరానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని మహారాష్ట్ర శాసనసభ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంత్ కల్సే తెలిపారు.

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా విషాదం.. వాహనం లోయలో పడి నలుగురు మృతి.. ఎక్కడంటే ?

అయితే ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఏర్పాటు చేసిన బలప్రదర్శనకు కొన్ని గంటల ముందు.. దక్షిణ ముంబైలో ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి ఆయన మద్దతుదారులు బుధవారం చేరుకున్నారు. కాగా.. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని యశ్వంత్ రావ్ చవాన్ సెంటర్ లో సమావేశం నిర్వహిస్తుండగా.. అజిత్ పవార్ వర్గం సబర్బన్ బాంద్రాలోని భుజ్ బల్ నాలెడ్జ్ సిటీలో సమావేశం నిర్వహిస్తోంది. అంతకంటే ముందు ఆయన మద్దతుదారులు దక్షిణ ముంబైలోని దేవ్ గిరి అధికారిక నివాసం వెలుపల గుమిగూడారు. అయితే 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 40 మంది అజిత్ పవార్ వెంట ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ పాటిల్ పేర్కొన్నారు.

బెంగళూరులో మహిళా టెక్కీ హత్య.. హైదరాబాద్ లో నివసించే మాజీ ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

కాగా.. శరద్ పవార్ ఇల్లు అయిన సిల్వర్ ఓక్ వెలుపల ఓ కార్యకర్త పట్టుకొని కనిపించిన ఓ పోస్టర్ అందరినీ ఆకర్శిస్తోంది. దానిపై 83 ఏళ్ల యోధుడు ఒంటరిగా పోరాడుతున్నాడు అని రాసి ఉంది. ఇదిలా ఉండగా.. అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత ఇరు వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన తొలి సమావేశాలు ఇవే. అయితే ఎవరికి వారు తమ వెంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడం గమనార్హం.