- Home
- National
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Dharmendra Pradhan: ఢిల్లీలో నిరసన జ్వాలలను చల్లబరిచేలా నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఎట్టకేలకు జంతర్ మంతర్ వద్ద చేసిన విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం దిగొచ్చింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీకేజీ వివాదం దాదాపు చల్లారింది. విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం దిగొచ్చింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ను అంగీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
విద్యార్థుల ఆందోళనకు ఫలితం
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టగా, ఈ ఉద్యమానికి సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు కూడా సంఘీభావం తెలిపారు.
ఆమోదించిన కేంద్రం!
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థుల ప్రధాన డిమాండ్ నెరవేరినట్లైంది. ఆయన రాజీనామాను కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని డిమాండ్
రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నీట్ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థి ఉద్యమం కీలక మలుపు తిరిగింది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే...
అయితే రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందన్నారు. యువత ఆకాంక్షలను, కలల్ని గౌరవిస్తానని తెలిపారు. 10 రోజులుగా జరుగుతున్న సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలో తల్జేర్ లో పుట్టారు. ఆయన తండ్రి దేవంద్ర ప్రధాన్ వాజ్ పేయి హయాంలో కేంద్రసహాయమంత్రిగా పనిచేశారు. 2000లో ధర్మేంద్రప్రధాన్ MLAగా గెలిచారు. 2004లో లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2021లో విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

