Asianet News TeluguAsianet News Telugu

మోడీ 3.0లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారుస్తా : అబుదాబీలో ఎన్ఆర్ఐలతో ప్రధాని

తన మూడో టర్మ్‌లో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారుస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని విశ్వబంధుగా చూస్తోందన్నారు. 

ahlan modi : my guarantee to make India 3rd largest economy in 3rd term, PM Narendra modi tells diaspora in UAE ksp
Author
First Published Feb 13, 2024, 9:32 PM IST

భారత్ - యూఏఈ స్నేహబంధం వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్న ఆయన.. మంగళవారం అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో భారతీయ కమ్యూనిటీ నిర్వహించిన ‘Ahlan Modi’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తన కుటుంబ సభ్యులను కలవడానికి ఇక్కడికి వచ్చానని , భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోందని మోడీ అన్నారు. యూఏఈ , భారత్‌లోని నలుమూలల నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి కొత్త చరిత్ర సృష్టించారని ఆయన పేర్కొన్నారు. 

30 ఏళ్ల తర్వాత యూఏఈలో పర్యటించిన తొలి భారత ప్రధానిని తానేనని ప్రధాని చెప్పారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలకపాత్ర పోషించారని.. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనను గౌరవించామని మోడీ గుర్తుచేశారు. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం తనకు లభించిందంటే .. అది మీ వల్లేనని ప్రధాని అన్నారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత వృద్ధి చెందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అబుదాబిలో ఆలయాన్ని నిర్మిస్తామని అడిగిన వెంటనే ఒప్పుకున్నామని నరేంద్ర మోడీ తెలిపారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయం కోసం స్థలం ఇస్తామన్నారని పేర్కొన్నారు. 

2015లో తాను తొలిసారి యూఏఈ పర్యటనకు వచ్చానని.. మూడు దశాబ్ధాల తర్వాత ఒక భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే తొలిసారని మోడీ చెప్పారు. అప్పటి క్రౌన్ ప్రిన్స్, నేటి ప్రెసిడెంట్ తన ఐదుగురు సోదరులతో కలిసి విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికారని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఘటనను తాను ఎప్పటికీ మరచిపోలేనని, ఆ స్వాగతం తన ఒక్కడికే కాదని, 140 కోట్ల మంది భారతీయులకు కూడా అని మోడీ అన్నారు. భారత్, యూఏఈ మధ్య ఇవాళ కీలక ఒప్పందాలు కుదిరాయని ఆయన తెలిపారు. మీ ఉత్సాహం ‘‘ ఏక్ భారత్, శ్రేష్ట భారత్’’ అనే అందమైన చిత్రాన్ని చిత్రించిందన్నారు. 

గడిచిన పదేళ్లలో యూఏఈకి ఇది తన 7వ పర్యటన అని.. షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌ ఇవాళ తనను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చారని ప్రధాని తెలిపారు. భారత్‌లో ఆయనకు నాలుగు సార్లు స్వాగతం పలికే అవకాశ లభించినందుకు సంతోషంగా వుందన్నారు. కొద్దిరోజుల క్రితం జాయెద్ గుజరాత్‌కు వచ్చారని.. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు లక్షలాది మంది ప్రజలు వీధుల్లో గుమిగూడారని మోడీ పేర్కొన్నారు. అబుదాబిలో గొప్ప ఆలయాన్ని ప్రారంభించే చారిత్రాత్మక క్షణం వచ్చిందని చెప్పారు. షేక్ నహ్యాన్ ప్రవాస భారతీయులకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి అని.. భారతీయ సమాజం పట్ల ఆయనకున్న అభిమానం అభినందనీయమన్నారు. 

యూఏఈ భారత్‌కు మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఇరుదేశాల సంబంధాలను ఆయన మోడీ హైలైట్ చేశారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. కొత్త ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆధునిక రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నామని ప్రధాని చెప్పారు. తన మూడో టర్మ్‌లో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారుస్తానని మోడీ పేర్కొన్నారు. మీరు ఇక్కడి నుంచి మన దేశంలోని వారికి సులువుగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. నేడు భారత్ ఒక శక్తిగా రూపొందిందని.. యూఏఈలో స్కూళ్లలో 1.5 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్ధులు చదువుతున్నారని ప్రధాని వెల్లడించారు. 

గత నెలలో ఇక్కడి ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో మాస్టర్స్ కోర్సును ప్రారంభించగా.. దుబాయ్‌లో త్వరలో కొత్త సీబీఎస్ఈ కార్యాలయం ప్రారంభం కానుందని మోడీ తెలిపారు. ఇక్కడి భారతీయ సమాజానికి అత్యుత్తమ విద్యను అందించడంలో ఈ సంస్థలు సహాయపడతాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశ విజయాలు ప్రతి భారతీయుడి సొంతం, ప్రతి భారతీయుడి శక్తిపై తనకు పూర్తి విశ్వాసం వుందని మోడీ తెలిపారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని విశ్వబంధుగా చూస్తోందన్నారు. భారత్ యూఏఈ కలిసి చరిత్రను రాస్తున్నాయని.. అందులో మీరు భాగమని ప్రధాని పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios