టాయిలెట్ సీటు దొంగలించాడని దళితుడికి గుండు కొట్టించి, ముఖంపై మసి పూసి, స్తంభానికి కట్టేసి దాడి.. ఎక్కడంటే ?
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడనే నెపంతో ఓ దళితుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు. ముఖంపై మసి పూశారు.
టాయిలెట్ సీటు దొంగిలించాడనే ఆరోపణలతో దళిత యువకుడిపై దాడి జరిగింది. అంతే కాదు ఆ యువకుడి ముఖానికి మసిపూసి, గుండు గీయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్నేహితుడిపై దాడి చేసి.. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్పై 10 మంది సామూహిక అత్యాచారం..
వివరాలు ఇలా ఉన్నాయి. బహ్రైచ్ జిల్లాలోని హార్ది ప్రాంతంలోని ఓ ఇంట్లో నుంచి 30 ఏళ్ల దళిత కార్మికుడైన రాజేష్ కుమార్ పై టాయిలెట్ సీటు దొంగలించాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానిక బీజేపీ నాయకుడు రాధేశ్యామ్ మిశ్రా, ఆయన ఇద్దరు సహచరులు గత మంగళవారం రాజేష్ కుమార్ను స్తంభానికి కట్టివేసి మసి పూశారు. అనంతరం యువకుడిని చితకబాదారు. తరువాత గుండు కొట్టించారు. ఇలా గుండు కొట్టించేటప్పుడు పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. బాధితుడిపై దాడి చేసే సమయంలో నిందితులను ఎవరూ ఆపకపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బీజేపీ నేత మిశ్రా పరారీలో ఉన్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ‘ఎన్డీటీవీ’కి తెలిపారు. బాధితుడు దొంగతనం చేసినట్టుగా అనుమానాలు ఉంటే ముందుగా పోలీసుల వద్దకు రావాల్సి ఉందని చెప్పారు.