తమిళనాడులో 85 ఏళ్ల రైతు హిందీ భాషను తమిళులపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. డీఎంకే కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒంటికి నిప్పు అంటించుకుని మరణించాడు. 

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రజలు తమ భాష తమిళంను అమితం ఇష్టపడతారు. వారి అస్తిత్వంలో భాషకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారు హిందీ భాష తమపై రుద్దవద్దంటూ చాలా సార్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇటీవలే పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులతో మరోసారి తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా, 85 ఏళ్ల రైతు హిందీ భాష తమపై రుద్దవద్దని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎంకే కార్యాలయం ఎదుట ఒంటికి నిప్పు అంటించుకుని తనువు చాలించాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సేలం జిల్లాకు చెందిన రైతు తంగవేల్ డీఎంకే యాక్టివ్ మెంబర్. విద్యలో హిందీ మీడియాన్ని ప్రవేశపెట్టే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తలయ్యూర్‌లోని డీఎంకే ఆఫీసు ముందు ఈ రోజు ఉదయం 11 గంటలకు తంగవేల్ తన ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: అధికారం కోసమే బీజేపీ భాష చిచ్చుపెడుతోంది.. హిందీ విధింపున‌కు వ్యతిరేకంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ తీర్మానం

తంగవేల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ బ్యానర్ రాశారు. ‘మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం, హిందీ జోకర్ల భాష. హిందీ భాషను మాపై రుద్దితే మా విద్యార్థుల జీవితాలపై ప్రభావం వేస్తాయి. హిందీని తొలగించండి’ అంటూ ఆయన ఓ బ్యానర్ పై రాశారు.

తమ రాష్ట్రంపై హిందీ మోపాలని ప్రయత్నిస్తే తమ పార్టీ ఆందోళనలు చేస్తుందని డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. తమ ప్రజల మనోభావాలను పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ తాము చూస్తూ ఊరుకోబోమని డీఎంకే ఇప్పటికే ఓ భారీ ఆందోళన చేపట్టింది.