కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 గురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యమునోత్రి హైవేపై కూలిన రక్షణ గోడ.. ఆ మార్గంలో చిక్కుకుపోయిన 10 వేల మంది ప్రయాణికులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో 21 మందితో కూడిన వాహనం బెంకనకట్టికి వెళ్తోంది. అయితే జిల్లాలోని నిగడి ప్రాంతానికి చేరుకునే సరికి ఆ వాహనం వెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 7 గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా మనసూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. వీరంతా వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అనన్య(14), హరీష్(13), మహేశ్వర్(11), శిల్ప(34), నీలవ్వ(60), మధుశ్రీ(20), శంభులింగయ్య(35)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్పై ఐపీసీ సెక్షన్ 304A (నిర్లక్ష్యమే మరణానికి కారణం) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా మార్చి నెలలో కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గత నెల 19వ తేదీన కర్నాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అయ్యో అస్సాం.. వరదలతో 500కు పైగా కుటుంబాలు రైలు పట్టాలపైనే.. 8 లక్షల మందిపై ప్రభావం..
మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర శివార్లలో కూడా శుక్రవారం జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చంద్రపూర్ జిల్లాలోని చంద్రాపూర్-ముల్ రోడ్డులో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో డీజిల్ లోడ్ చేసి ఉన్న ట్యాంకర్, కలప లోడ్ చేసి ఉన్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో అక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 9 మంది సజీవ దహనం అయ్యారు.
ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మంటల చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే కొన్ని గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమీపంలోని పలు చెట్లు కూడా మంటల్లో కాలిపోయాయి. అయితే డీజిల్ ట్యాంకర్ లారీ టైర్ పగిలిపోవడంతో అది ముందు వస్తున్న ట్రక్ ను ఢీకొట్టిందని, దీంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
