యమునోత్రి హైవేపై కూలిన రక్షణ గోడ.. ఆ మార్గంలో చిక్కుకుపోయిన 10 వేల మంది ప్రయాణికులు..
ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవేపై రక్షణ గోడ కూలడంతో 10వేలకు పైగా ప్రయాణికులు ఈ మార్గంలో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవేపై రక్షణ గోడ కొంత భాగం కూలడంతో 10వేలకు పైగా ప్రయాణికులు ఈ మార్గంలో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే వెంబడి పలు ప్రాంతాల్లో 10,000 మంది ప్రజలు చిక్కుకున్నారని సమాచారం. జాంకిచట్టి వద్ద డజన్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ రహదారిని తిరిగి తెరవడానికి మూడు రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
ఇక, జిల్లా యంత్రాంగం కొన్ని చిన్న వాహనాల్లో ప్రయాణికులను తరలించేందుకు యత్నిస్తున్నారు. అయితే దూరం నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారిని తరలించడం సాధ్యం కావడం లేదు. ఇక, యమునోత్రి ధామ్కు వెళ్లే హైవేపై వచ్చే మూడు రోజుల పాటు భారీ వాహనాలను మూసివేయనున్నారు. ఇక, National Highway Authority of India ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పంత్ మాట్లాడుతూ రహదారిని తిరిగి తెరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
ఇక, ఇప్పటి వరకు 6.5 లక్షల మంది చార్ధామ్ యాత్రను పూర్తి చేశారు. బుధవారం నాటికి 16,788 మంది కేదార్నాథ్ చేరుకున్నారు. దీంతో 2 లక్షల 33 వేల 711 మంది కేదార్నాథ్ను సందర్శించారు. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 1 లక్షా 88 వేల 346 మంది బద్రీనాథ్ను సందర్శించారు. యమునోత్రిని 1,06,352 మంది సందర్శించారు. గంగోత్రిని 1,30,855 మంది సందర్శించారు. ఇదిలావుండగా, చార్ ధామ్ యాత్ర పరిస్థితుల నేపత్యంలో ఈ మార్గంలో భక్తుల కోసం ప్రయివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను తీసుకువచ్చారు.
భక్తులకు ఉచిత ఆరోగ్య సేవలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. "చార్ ధామ్ యాత్ర ప్రజలకు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుందని మరియు యాత్ర అంతటా వారు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరకుకుంటున్నాము. సామాజిక సంస్థకు చెందిన వైద్యులు మరియు నర్సుల బృందాలు ఈ సమయంలో భక్తులకు ఆరోగ్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా యాత్ర అందిస్తాయి" అని తెలిపారు. అయినప్పటికీ.. ఇప్పటికే 40 మందికి పైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.