అస్సాంను వరదలు వదలడం లేదు. దీంతో అస్సాంలోని అనేక జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అనేక మంది టార్ఫలిన్ ల షెడ్ లు వేసుకొని జీవిస్తున్నారు. వందల కుటుంబాలు రైలు పట్టాలపై ఉంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నాయి.
అస్సాం వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. వర్షాల ఉగ్రరూపం వల్ల లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమవుతున్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అందులో భాగంగా జమునముఖ్ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు రైల్వే ట్రాక్లపైనే నివసిస్తున్నాయి. ఆ ప్రాంతంలో వరద నీటిలో మునిగిపోయిన ఏకైక ప్రదేశం ఆ పట్టాలే కావడంతో స్థానికులంతా ఆ పట్టాలపైనే ఉంటున్నారు.
అలాగే చాంగ్జురై, పాటియా పత్తర్ గ్రామాల ప్రజలు వరదల కారణంగా దాదాపు తమ వద్ద ఉన్న సర్వస్వం కోల్పోయారు. టార్పాలిన్ షీట్లతో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన గ్రామస్తులు, గత ఐదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 43 ఏళ్ల మోన్వారా బేగంకు పాటియా పత్తర్ గ్రామంలో ఉన్న ఇళ్లు వరదల వల్ల ధ్వంసం అయ్యింది. దీంతో ఆమె తన కుటుంబంతో తాత్కాలిక షెడ్లో నివసిస్తున్నారు. వరదల నుంచి బయటపడేందుకు మరో నాలుగు కుటుంబాలు కూడా వారితో కలిసి ఉంటున్నాయి. వారంతా దాదాపు ఆహారం లేకుండా, అమానవీయ పరిస్థితుల్లో ఒకే షీట్ కింద జీవిస్తున్నారు.
అర్థరాత్రి పెళ్లి... ఆలస్యమౌతోందని పంతులు తిప్పలు.. వీడియో...!
‘‘ మూడు రోజులు మేము ఆకాశం కిందనే ఎలాంటి పైకప్పు లేకుండానే ఉన్నాము. దీంతో మేము కొంత డబ్బును అప్పు తీసుకొని ఈ టార్పాలిన్ షీట్ కొన్నాం. ఆ ఒక షీట్ కిందనే ఐదు కుటుంబాలు జీవిస్తున్నాయి. మాలో ఎవరికీ ప్రైవెసీ లేదు.’’ అని మోన్వారా బేగం చెప్పారు.
మరో బ్యూటీ బోర్దోలోయ్ కుటుంబం కూడా చాంగ్జురై గ్రామంలో ఇంటిని కోల్పోయి టార్పాలిన్ షీట్లో జీవిస్తోంది. ‘‘ కోతకు సిద్ధంగా ఉన్న మా వరి పంట వరదల్లో నాశనమైంది. ఇలా జీవించడం చాలా కష్టం కాబట్టి పరిస్థితి చెప్పలేకుండా ఉంది ’’ అని ఆమె ఎన్డీటీవీతో తెలిపారు. ‘‘ ఇక్కడ పరిస్థితి చాలా ఛాలెంజింగ్ ఉంది. సురక్షితమైన తాగునీటి వనరు లేదు. మేము రోజుకు ఒకసారి మాత్రమే తింటున్నాం. గత నాలుగు రోజులుగా మాకు కొంత బియ్యం మాత్రమే అందింది’’ అని బోర్డోలోయ్ బంధువు సునంద డోలోయ్ చెప్పారు. ‘‘ నాలుగు రోజుల తర్వాత మాకు నిన్న ప్రభుత్వం నుంచి సహాయం వచ్చింది. వారు మాకు కొంచెం బియ్యం, పప్పు, నూనె ఇచ్చారు. కానీ కొంతమందికి అది కూడా రాలేదు’’ అని పాటియా పత్తర్కు చెందిన మరో వరద బాధితుడు నసీబుర్ రెహ్మాన్ తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా అస్సాం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో ఉన్న 2,585 గ్రామాలలో 8 లక్షల మందికి పైగా ప్రజల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. రుతుపవనాలకు ముందు వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 343 సహాయ శిబిరాల్లో 86,772 మంది ఆశ్రయం పొందుతున్నారు. మరో 411 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా వీరి సహాయార్థం పనిచేస్తున్నాయి. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలు పడవలు, హెలికాప్టర్లను ఉపయోగించి వరద ప్రభావిత ప్రాంతాల నుండి 21,884 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
