Rains: రెండు గంటల్లోనే 61,000 పిడుగులు.. ఒడిశాలో 12 మంది దుర్మరణం
ఒడిశాలో భీకర వర్షంతోపాటు పిడుగులు కూడా పెద్ద సంఖ్యలో పడుడుతున్నాయి. శనివారం రెండు గంట్లలోనే 61 వేల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటు వల్ల పలు జిల్లాల్లో 12 మంది మరణించారు. 14 మంది గాయపడినట్టు సమాచారం.
భువనేశ్వర్: ఒడిశాలో భీకర వర్షం కురుస్తున్నది. జడివానతోపాటు ఉరుములు, మెరుపులే కాదు.. పిడుగులు కూడా పడుతున్నాయి. దీంతో ప్రజలు చేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వర్షంతో పోటీ పడుతూ ఇక్కడ పిడుగులు పడుతున్నాయి. ఒడిశాలో రెండు గంటల్లోనే 61 వేల పిడుగులు పడ్డాయంటేనే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. శనివారం రెండు గంటల వ్యవధిలో 61 వేల పిడుగులు పడ్డాయని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషన్ సత్యవ్రత సాహూ వెల్లడించారు.
ఈ పిడుగుల కారణంగా 12 మంది దుర్మరణం చెందారని సత్యవత్రా సాహూ వివరించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. గజపతి, జగత్ సింగ్ పూర్, పూరీ, బలంగీర్ సహా పలు జిల్లాల్లో పిడుగుపాటు వల్ల 12 మంది మరణించారని వివరించారు. పశువులు కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ భారీ వర్షాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసి తెలిపింది. దీంతో పిడుగుల గండం మరికొన్ని రోజులపాటు తప్పదనే భయం నెలకొని ఉన్నది.
Also Read: మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడో వివాహం లండన్లో.. అతిథులుగా నీతా అంబానీ, లలిత్ మోడీ
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో భారీ వర్షాలు పడుతాయని చెబుతున్నారు. ఈ భయానక వాతావరణం ఇలాగే కొనసాగనుండటంతో పలు జిల్లాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.