తొలిరోజే అయోధ్య రామయ్య అద్భుత రికార్డు... ఏకంగా 5 లక్షలమందా...!
బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య నగరం భక్తజనసంద్రంగా మారింది.
![5 lakhs devotees get Ayodhya Balak Ram Darshan on First Day AKP 5 lakhs devotees get Ayodhya Balak Ram Darshan on First Day AKP](https://static-ai.asianetnews.com/images/01hmrfgdekwwpm9xcfqje2qkx5/ram-lalla-picture-1705923589587_363x203xt.jpg)
అయోధ్య : శ్రీరాముడి జన్మ భూమి అయోధ్యలో నిర్మితమైన రామమందిరం గత సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. దేశంలోని అతిరధ మహారథుల, సాధుసంతుల సమక్షంలో అయోధ్య గర్భగుడిలో కొలువైన బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ట పూజలు చేసారు. తర్వాతిరోజు అంటే గత మంగళవారం నుండి 'బాలక్ రామ్' సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. అయోధ్య రామయ్యను కనులారా చూసి తరించేందుకు భక్తులు పోటేత్తారు. ఇలా భక్తజనసంద్రంగా మారిన అయోధ్యలో మొదటిరోజే రికార్డ్ నమోదయ్యింది.
బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకల కోసం అయోధ్యకు చేరుకున్న సామాన్యులు మంగళవారం దర్శనం చేసుకున్నారు. అలాగే దేశ నలుమూలల నుండి బాలక్ రామ్ ను దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు అయోధ్య బాట పట్టారు. ఇలా తొలిరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్, అయోధ్య అధికారులు తెలిపారు.
Also Read ప్రతిష్టాపన నా జీవితంలో మరపురాని ఘట్టాల్లో ఒకటి - రాష్ట్రపతికి ప్రధాని మోడీ లేఖ
మంగళవారం ఉదయం నుండే అయోధ్యలో భక్తుల సందడి మొదలయ్యింది. రామమందిర పరిసరాలన్ని భక్తులతో నిండిపోయాయి. తీవ్ర చలిని కూడా లెక్కచేయకుండా సోమవారం రాత్రినుండే భక్తులు క్యూలైన్లలో ఎదురుచూసారు. ఉదయం 6 గంటలకు రామమందిర ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఇలా మధ్యాహ్నానికి రద్దీ మరింత పెరిగింది. రాత్రి ఆలయాన్ని మూసివేసే సమయానికి దాదాపు 5 లక్షల మంది బాలక్ రామ్ ను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకలను ప్రత్యక్షప్రసారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ కూడా సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాను ప్రసారం చేసేందుకు ఆయన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటుచేసారు. ఇందులో అయోధ్య ప్రారంభోత్సవ వేడుకలను ప్రసారం చేయగా అత్యధిక మంది వీక్షించారు. 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా మోదీ యూట్యూబ్ ఛానల్ లో వీక్షించారు. ప్రస్తుతం యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వీక్షణల్లో ఇదే సరికొత్త రికార్డు.
నరేంద్రమోడీ ఛానెల్లోని ఈ లైవ్కి ఇప్పటివరకు మొత్తం 1 కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఈ ఛానల్ లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డు 2 వ స్థానానికి చేరింది. ఇక మూడవ స్థానంలో FIFA వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం ఉండగా.. నాలుగో స్థానంలో Apple లాంచ్ ఈవెంట్ ఉంది.