చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి రూ. 2 కోట్ల పెనాల్టీ.. ఏడాది జైలు శిక్ష
పంజాబ్లో ఓ చెక్ బౌన్స్ కేసులో ఇద్దరు వ్యాపారులకు కోర్టు రూ. 2 కోట్ల పెనాల్టీ విధించింది. అంతేకాదు, ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసు 2009కి చెందినది కావడం గమనార్హం. శుక్రవారం పంజాబ్లోని సోహ్నా కోర్టు తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరు వ్యాపారులకు ఓ కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే, రూ. 2 కోట్ల జరిమానా పెనాల్టీ విధించింది. 11 ఏళ్ల కిందటి చెక్ బౌన్స్ కేసులో పంజాబ్లోని సోహ్నా కోర్టు తీర్పు ఇచ్చింది. పాల వ్యాపారులైన తండ్రీ కొడుకులకే ఈ శిక్ష పడింది.
2009లో సోహ్నాకు చెందిన వ్యాపారి దీపక్ బన్సాల్ పెద్ద మొత్తంలో పాలను పంజాబ్లోని దేవ్ మిల్క్ స్పెషాలిటీకి సరఫరా చేశాడు. దేవ్ మిల్క్ స్పెషాలిటీ ఓనర్లు అర్పిందర్ పన్ను, రంజిత్ సింగ్ పన్ను. 2009 జూన్ నుంచి 2009 డిసెంబర్ వరకు పాల సప్లై జరిగింది. తొలుత కొంత మొత్తం పేమెంట్ జరిగిన తర్వాత పాల సప్లై జరిగింది. కానీ, మిగిలిన సుమారు రూ. 1.5 కోట్ల రూపాయలు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి.
2010 అక్టోబర్ 20న నిందితులు రూ. 1.9 కోట్ల చెక్ను (అర్పిందర్, రంజిత్ సంతకాలు చేసిన చెక్) జారీ చేశారు. మరుసటి రోజే బ్యాంకుకు తీసుకెళ్లారు. కానీ, నిధులు లేని కారణంగా చెక్ బౌన్స్ అయింది. మరోసారి వారిని అప్రోచ్ కాగా ఇంకోసారి 2011 జనవరి 5న చెక్ ఇష్యూ చేశారు. కానీ, ఇది కూడా బౌన్స్ అయింది. అప్పుడు వారి డబ్బులను 2011 ఏప్రిల్లో చెల్లిస్తామని తండ్రీ కొడుకులు హామీ ఇచ్చారు. కానీ, అప్పటికీ ఆ మొత్తం చెల్లించకపోవడంతో బాధితుడు వారికి లీగల్ నోటీసులు పంపాడు.
Also Read: రామమందిర విరాళాలు.. 15 వేల చెక్కులు బౌన్స్.. !!
2011 మే నెలలో సోహ్నా కోర్టులో కేసు ఫైల్ అయింది. నిందితులు మొత్తం రూ. 3.9 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. అందులో రూ. 1.1 కోట్లు మాత్రమే చెల్లిచారని బాధితుడి కౌన్సెల్ రాజీవ్ కౌశిక్ తెలిపారు. 2012 నవంబర్లో ఫతేగడ్ సాహిబ్లోని బస్సీ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
ఈ కేసులో తండ్రీ కొడుకులను దోషులుగా తేల్చిన సబ్ డివిజినల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కవితా యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దోషులకు ఏడాది పాటు సాధారణ కారాగార వాసం శిక్ష విధించింది. అలాగే, ఇద్దరు కలిసి రూ. 2 కోట్లు పరిహారం బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.