ఆపరేషన్ సింధూర్లో భారతదేశం నిర్వహించిన దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు.
ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక సమాచారం వెల్లడించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం నిర్వహించిన దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు.పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు చేపట్టామని తెలిపారు. పాకిస్తాన్ దాడి చేస్తే తిప్పికొట్టడానికి సిద్దంగా ఉన్నామని రక్షణ మంత్రి తెలిపారు.
పాకిస్తాన్, పివోకే లోని ఉగ్రవాదుల స్థావరాలపై సైన్యం సమన్వయంతో నిర్వహించిన దాడుల గురించి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపక్ష పార్టీల నాయకులకు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడిన జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ- తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు ఈ దాడులు గట్టి దెబ్బగా ఆయన అభివర్ణించారు. పాక్ ప్రతీకార చర్యలకు దిగితే తిప్పికొట్టడానికి భారత సైన్యం అప్రమత్తంగా ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ అన్నారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ... భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను అన్నిపార్టీలు ప్రశంసించాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం చేపట్టే అన్నిచర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని అన్నిపార్టీల తెలిపాయి.
అయితే ఆపరేషన్ సిందూర్ అప్పుడే ముగియలేదు... ఉగ్రవాదులపై పోరాటం కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో తెలిపినట్లు కిరణ్ రిజుజు వెల్లడించారు. అందుకే ఇప్పుడు ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమంటూ కేంద్ర మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేసారు.