ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా మే 8న ర్యాలీని సీఎం రేవంత్ నిర్వహించనున్నారు. భద్రతపై సమీక్ష చేపట్టి శాఖలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ఆపరేషన్ సిందూర్‌కి మద్దతుగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని కోరుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. మే 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ముఖ్యమంత్రి ప్రజలను అభ్యర్థించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ అనంతరం రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రతా పరిస్థితులు, కార్యాచరణపైన సమీక్షించి, సంబంధిత శాఖలకు స్పష్టమైన సూచనలు చేశారు.

కొరత లేకుండా చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు నిలిచిపోకుండా, ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి, దేశవిదేశాల నుంచి తెలంగాణను సందర్శించనున్న వారు భద్రతా సమస్యలు ఎదుర్కొనకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. ప్రత్యేకంగా రక్షణ రంగ సంస్థలు, శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను మరింత బలపరచాలని సూచించారు. రాష్ట్ర నిఘా వ్యవస్థలు కేంద్ర సంస్థలతో సమన్వయం సాధిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇలాంటి చర్యలన్నీ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలలో విశ్వాసం పెంచడమే కాకుండా, దేశ భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయి.