దేశ భద్రత కోసం కనీసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ చెప్పారు. సరిహద్దు పర్యవేక్షణలో ఇవి కీలకమని వెల్లడించారు.

ఇంఫాల్: ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఐదవ కాన్వకేషన్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, దేశ భద్రతలో ఉపగ్రహాల పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల రక్షణ కోసం కనీసం 10 భారతీయ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఉపగ్రహాల సేవలు సరిహద్దుల్లో, సముద్ర తీరాల్లో జరుగు ప్రతి కదలికను పర్యవేక్షించడంలో కీలకమని పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భారతదేశానికి సుమారు 7000 కిలోమీటర్లకు పైగా ఉన్న తీరరేఖతో పాటు ఉత్తర సరిహద్దులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నారాయణన్ తెలిపారు. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత లేకుండా ఇది సాధ్యం కాదన్నారు. మన పొరుగు దేశాల దుష్ప్రవర్తనను గమనించేందుకు, ప్రజల రక్షణకు ఇది అత్యవసరమని స్పష్టం చేశారు.

ఇక ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపిన ఘటనను భారత్ తీవ్రంగా తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు.

దీని తర్వాత పాకిస్తాన్ ఆగ్రహంతో సరిహద్దుల్లో డ్రోన్లు, షెల్లింగ్ ద్వారా దాడులు ప్రారంభించింది. పంజాబ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లోని నగరాలు, గ్రామాల్లో భయ వాతావరణం నెలకొంది. భారత్ కూడా వెంటనే తగిన స్పందన ఇచ్చింది. తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.అయితే, కాల్పుల విరమణ జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తిరిగి జమ్మూలో డ్రోన్ దాడికి పాల్పడింది. భారత బలగాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. దీని తర్వాత పాకిస్తాన్ చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి మెల్లగా సాధారణ స్థితికి వస్తోంది.