అసోంలో ఆటో, ట్రక్కు ఢీ: 10 మంది మృతి
అసోంలో ఆటో, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. చట్ ఫూజలకు ఆటోలో వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకొంది.
అసోం రాష్ట్రంలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. చట్పూజ చేసేందుకు ఆటోలో వెళ్తున్న 10 మంది మరణించారని పోలీసులు తెలిపారు. అసోంలోని కరీంగంజ్ జిల్లాలోని 8వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు,మహిళలున్నారు. చట్ పూజ ముగించుకొని Auto లో ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న Truck ఆటోను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.
మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు పిల్లలు, ఐదుగురు మహిళలున్నారని పోలీసులు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ మీతిమీరిన వేగంతో వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మృతులకు అసోం ఎక్సైజ్ శాఖ మంత్రి పరిమల్ సుక్లాబైద్య సంతాపం తెలిపారు. ట్రక్ డ్రైవర్ ను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
also read:జనగామలో ఘోరం: 105మంది విద్యార్థులతో కూడిన బస్సును ఢీకొన్న లారీ... ఇద్దరి పరిస్థితి విషమం
మృతులను కరీంగంజ్ జిల్లాలోని లొంగై టీ ఎస్టేట్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంగంజ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై అసోం సీఎం హిమంతశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 2020 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారంగా అసోం రాష్ట్రంలో 6737 రోడ్డు ప్రమాదాల్లో 2813 మంది మరణించారు. వీరిలో అత్యధిక మరణాలకు అతి వేగమే కారణంగా అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 3293 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2530 మంది గాయపడ్డారు.1377 మంది మృతి చెందారు.