తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిట్లర్ యూదులపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు , సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సారూప్యత ఉందని కమలం పార్టీ ఆరోపించింది.
న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. గతంలో హిట్లర్ యూదులపై చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు మధ్య సారూప్యత ఉందని బీజేపీ అభిప్రాయపడింది. సోషల్ మీడియా వేదికగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడింది. నాడు హిట్లర్ యూదులను వర్ణించిన తీరు, నేడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వ్యాఖ్యల మధ్య సారూప్యత ఉందని బీజేపీ అభిప్రాయపడింది. హిట్లర్ తరహలోనే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారని బీజేపీ అభిప్రాయపడింది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు భారత్ లో 80 శాతం భారత జనాభాపై మారణహోమానికి పిలుపునిచ్చిందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఉదయనిధి స్టాలిన్ పైత్యానికి కాంగ్రెస్, ఇండియా కూటమి మద్దతునివ్వడం కలవరపెడుతుందని బీజేపీ వ్యాఖ్యానించింది.
ఈ నెల 2న తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ఆ వ్యాధులను ఎలా నిర్మూలిస్తామో సనాతన ధర్మాన్ని కూడ అలానే నిర్మూలించాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు బీజేపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు కూడ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
also read:ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తా: అయోధ్య సాధువు ప్రకటన (Video)
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలోని పార్టీలు ఈ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒక వర్గాన్ని బాధ పెట్టే విషయంలో జోక్యం చేసుకోవద్దని బెంగాల్ సీఎం మమత బెనర్జీ కోరారు. ప్రజలకు హాని కల్గించే ఈ వ్యాఖ్యలు చేయవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్టుగా మమత బెనర్జీ కోరారు.
