రాహుల్ గాంధీ ప్లాన్: కేసీఆర్ తో చిదంబరం, జగన్ తో ప్రణబ్ ముఖర్జీ
కేసీఆర్ తో చర్చలు జరపడానికి కాంగ్రెసు అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని పంపించే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో చిదంబరానికి సత్సబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును రూపొందించడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు.
న్యూఢిల్లీ: లోకసభ ఫలితాలు వెలువడడానికి ముందే కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీల నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తో మాత్రమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాయబారాలు నడిపేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ తో చర్చలు జరపడానికి కాంగ్రెసు అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని పంపించే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో చిదంబరానికి సత్సబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును రూపొందించడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్ద్వంద్వంగా బలపరిచారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎఐసిసి నాయకుల్లో ఎవరికీ పెద్దగా సంబంధాలు లేవు. అయితే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎనలేని గౌరవం. జగన్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణబ్ ముఖర్జీ సేవలను కాంగ్రెసు అధిష్టానం వినియోగించుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సీనియర్ నేతలు వీరప్ప మొయిలీతోనూ గులాం నబీ ఆజాద్ తోనూ సత్సంబంధాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డితో చర్చలకు వారిద్దరిని పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెసుకు దగ్గర కావడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో టీఆర్ఎస్ తమతో కలిసి రావడానికి పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చునని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా తన వెంట తీసుకుని వెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితాల వెల్లడికి ముందే ఇది ఓ కొలిక్కి రావచ్చునని భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు: జగన్ తోనూ సంప్రదింపులు
రూట్ మార్చిన కేసీఆర్: మోడీకి కటీఫ్, రాహుల్ తో దోస్తీ
మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు: అమిత్ షా ఫోన్