పెరూలో రాజకీయ సంక్షోభం.. హింసాత్మక ఘర్షణల్లో ఇద్దరి మృతి.. 20 మందికి గాయాలు
పెరూలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడిని పదవిని తొలగించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలు తాజాగా హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.
పెరూలో కొంత కాలం నుంచి రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఈ క్రమంలో గత గురువారం నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని పదవి నుంచి తొలగించారు. అభిశంసన విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. దీంతో అతడి మద్దతుదారులు దక్షిణ పెరూలోని అండహుల్లాస్ నగరంలో నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం మొదలైన వివాదం శనివారం హింసాత్మకంగా మారింది. శనివారం నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు పోలీసు అధికారులతో పాటు 20 మంది గాయపడ్డారు. ఇద్దరు మరణించారు.నిరసనకారులు కొంతమంది పోలీసు అధికారులను కూడా బందీలుగా ఉంచారు.
శబరిమలకు ఒక్కరోజే లక్షమంది దర్శనం.. పోటెత్తిన భక్తులు...
ఈ హింసాత్మక నిరసనలపై పెరూ అంబుడ్స్మన్ కార్యాలయ అధిపతి ఎలియానా రివోలర్ స్థానిక రేడియో స్టేషన్ ‘ఆర్పీపీ’తో మాట్లాడుతూ.. అపురిమాక్లోని ఆండియన్ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఘర్షణల కారణంగా ఇద్దరు యువకులు మరణించారని, వారిలో ఒకరి వయస్సు 15, మరొకరి వయస్సు 18 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. తుపాకీ గాయాల వల్ల వారు చనిపోయి ఉంటారని చెప్పారు. క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని అపురిమాక్ ఏరియా గవర్నర్ బాల్టాజర్ లాంటారోన్ తెలిపారు.
ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో మహిళల మర్మాంగాలపై ఫైరింగ్.. వైద్యులు ఏమన్నారంటే?
హింసాత్మక నిరసనలపై లోక్పాల్ కార్యాలయం ఓ ప్రకటనలో ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. హింసాత్మక మార్గాల్లో నిరసన చేయొద్దని కోరింది. అలాగే బందీలుగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను విడుదల చేశారని, ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని పెరూవియన్ పోలీసులు తెలిపారు.
ఎమర్జెన్సీ ప్రకటనతో వివాదం..
పెడ్రో బుధవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించబోతున్నట్లు చెప్పడంతో మొత్తం వివాదం మొదలైంది. ప్రతిపక్ష పార్టీల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ను రద్దు చేస్తానన్నారు. ఈ ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోవడంతో పాటు పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఈ ప్రకటన తర్వాత కొన్ని గంటలకే ప్రతిపక్షం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి గురువారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. 130 మంది సభ్యులున్న పార్లమెంట్లో తీర్మానానికి అనుకూలంగా 101 ఓట్లు రాగా.. అధ్యక్షుడికి అనుకూలంగా ఆరు మాత్రమే వచ్చాయి. 10 మంది ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.