పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య చిన్నసైజు యుద్దమే జరిగింది. అయితే ఇరుదేశాల మధ్య వాతావరణం కాస్త చల్లబడింది. ఈ సమయంలో భారత్ తో శాంతి చర్చలకు తాము సిద్దమేనని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
India Pakistan : ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కూడా భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి యత్నించింది. ఇలా దేశాలకు కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు కయ్యానికి కాళ్లు దువ్వారు. తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదరడంతో పరిస్థితి అదులోకి వచ్చింది.
అయితే భారత్ తో శాంతి చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే కాశ్మీర్ అంశంపై చర్చలు జరగాలని ఆయన అన్నారు. కాశ్మీర్ విషయంలో ఓ అవగాహనకు వద్దామనేలా ఓ ఇంటర్వ్యూలో షహబాజ్ స్పష్టం చేసారు.
గురువారం కామ్రా వైమానిక స్థావరాన్ని పరిశీలించిన ఆయన పాకిస్తాన్ వైమానిక దళ పైలట్లు, సిబ్బందితో సంభాషించారు. ఈ సమయంలో ఆయన ఈ ప్రతిపాదనను భారత్ ముందుంచారు. శాంతిని సాధించడానికి పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందని, కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయని ఆయన అన్నారు. కాశ్మీర్ అంశంపై చర్చలు జరపాలని ఆయన భారత్ను కోరారని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
అయితే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.సోమవారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఏవైనా చర్చలు ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కే పరిమితం అవుతాయని పునరుద్ఘాటించారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, “పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదంపై మాత్రమే; పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)పై మాత్రమే అని నేను ప్రపంచ సమాజానికి కూడా చెప్పాలనుకుంటున్నాను” అని స్పష్టం చేసారు.
ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు దాని పతనానికి దారితీయవచ్చని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయకుండా శాంతిని సాధించడం అసాధ్యం అని ఆయన అన్నారు. "పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరు, ఒకరోజు పాకిస్తాన్ను నాశనం చేస్తుంది. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే, దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాల్సి ఉంటుంది. శాంతికి వేరే మార్గం లేదు," అని ఆయన అన్నారు.
భారత్-పాక్ సంఘర్షణ
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయి, పలువురు గాయపడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. ఇందులోొ జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ- తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.
దాడి తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ, జమ్మూ కాశ్మీర్ అంతటా కాల్పులకు దిగింది. అలాగే సరిహద్దు ప్రాంతాల వెంబడి డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. దాని తర్వాత భారత్ సమన్వయ దాడిని ప్రారంభించి, పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలలో రాడార్ మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసింది. మే 10న, భారత్, పాకిస్తాన్ శత్రు చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనకు వచ్చాయి.