పాకిస్థాన్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటనకు పాల్పడుతున్నవారిపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత 16 నెలల్లో సౌదీ అరేబియా మొత్తం 5,033 పాకిస్థానీ భిక్షాటనదారులను తిరిగి దేశానికి పంపినట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

ఈ విష‌యాన్ని స్వ‌యంగా పాకిస్థాన్‌కు చెందిన మంత్రి మొహ్సిన్ నక్వీ జాతీయ అసెంబ్లీకి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఈ లెక్కల ప్రకారం జనవరి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 5,402 మంది పాకిస్థానీలు – సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమాన్, కతార్, యుఎఈ ల నుంచి భిక్షాటన చేసిన కేసుల్లో తిరిగి పాక్‌కు వ‌చ్చారు. 

వారిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారే. సింద్ నుంచి 2,795 మంది. పంజాబ్ రాష్ట్రం నుంచి 1,437 మంది, ఖైబర్ పఖ్తున్ ఖ్వా – 1,002 మంది, బలోచిస్తాన్ – 125 మంది, అజాద్ కాశ్మీర్ – 33 మంది, ఇస్లామాబాద్ – 10 మంది ఉన్నారు.

ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా ఇటీవలి కాలంలో పాకిస్థానీ పౌరులపై వీసా పరిమితులను మరింత కఠినతరం చేసింది. యూఏఈ నుంచి సుమారు 58 మంది బిచ్చ‌గాళ్ల‌ను వారి దేశానికి పంపింది. మొత్తం 369 మంది పాకిస్థానీలు ఇత‌ర‌ 5 దేశాలలో కూడా ఇదే కారణంగా అరెస్ట్ అయ్యారు.

ఇక మరో ప్రశ్నకు సమాధానంగా, మంత్రి మొహ్సిన్ నక్వీ స‌మాధానం ఇస్తూ.. నవంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 10 లక్షలకు పైగా అక్రమంగా దేశంలో ఉన్న అఫ్గానీలను పాకిస్థాన్ నుండి బహిష్కరించామని. వీరిలో చాలా మంది అఫ్గాన్ సిటిజన్ కార్డులు (ACC) కలిగి ఉన్నవారని తెలిపారు.