Pakistan Nuclear Threat to India: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి భారత్ కు వ్యతిరేకంగా అత్యంత వివాదాస్పద ప్రకటన చేశారు.  

Pakistan Nuclear Threat to India: పాకిస్థాన్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కింది. అమెరికా అండతో పాకిస్థాన్ రెచ్చిపోతుంది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు అణు దాడి బెదిరింపులు విసురుతోంది. సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారక ముందే, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ గాలులు మళ్లీ ఎగసిపడుతున్నాయనే అనుమానాలు మరోసారి వస్తున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పాకిస్తాన్‌ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారతదేశంపై అణు బెదిరింపులు జారీ చేశారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ మాట్లాడుతూ.. " మాది అణు శక్తి కలిగిన దేశం. మేము ప్రమాదంలో ఉన్నామని తెలిస్తే.. సగం ప్రపంచాన్ని మాతోపాటు తీసుకెళ్లాం" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సింధూ నది వివాదం

ఆపరేషన్ సింధూర్ తరువాత రెండోసారి అమెరికా పర్యటనకు వచ్చిన పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ సింధూ నదిపై నియంత్రణ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. ‘భారత్ ఒక ఆనకట్ట కడితే, దానిని పది క్షిపణులతో నేలమట్టం చేస్తాం. సింధూ నది భారతీయుల వ్యక్తిగత ఆస్తి కాదు. అయినా మాకు క్షిపణుల కొరత లేదు’అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికా అండతో రెచ్చిపోయాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. "భారత్‌ హైవేపై దూసుకెళ్తున్న మెర్సిడెస్‌ కారు లాంటిది, కానీ మేము రాళ్లతో నిండిన డంప్ ట్రక్‌. ఆ ట్రక్‌ కారును ఢీకొంటే, ఎవరు నష్టపోతారు? అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆర్థిక, సైనిక శక్తి తక్కువని అంగీకరిస్తూనే మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ పై సంచలన ఆరోపణలు

కెనడాలో సిక్కు నాయకుడి హత్య, ఖతార్‌లో ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారుల అరెస్ట్‌, కులభూషణ్ జాధవ్‌ కేసు వంటి ఘటనలు భారత్‌ అంతర్జాతీయంగా ఉగ్రవాదంలో పాలుపంచుకుంటున్నదనడానికి సాక్ష్యమని మునీర్‌ సంచలన ఆరోపణలు చేశారు.

అమెరికా నేతలతో భేటీలు

మునీర్ తన పర్యటనలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాజీ కమాండర్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ కార్యక్రమం, కొత్త కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్‌తో భేటీ అయ్యి పాకిస్తాన్‌కు రావాలని ఆహ్వానించారు. ఇది మునీర్ రెండోసారి అమెరికా పర్యటన. జూన్‌లో ఆయన మొదటి సారి డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత అమెరికా-పాకిస్తాన్ మధ్య చమురు ఒప్పందం సహా పలు సహకారాలు పెరిగాయనే చెప్పాలి.