ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఉద్రిక్తతల వేళ భారత్ తమ భూభాగంలో క్షిపణులతో దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. భారత్ దాడులపై ఆయన ఏమన్నారంటే.. 

India Pakistan Conflict : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల భారత్ జరిపిన దాడులపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.  రావల్పిండి విమానాశ్రయంతో సహా ప్రధాన సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిందన్నారు. ఈ విషయం తమ సైన్యానికి తెలియదని ఆయన ఒప్పుకున్నారు. భారత్ దాడులకు దిగినా పాకిస్తాన్ సైన్యం ఏమీ చేయలేకపోయిందన్నారు.

అజర్‌బైజాన్‌లో ఒక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ… తమ సైన్యాధిపతి (ఇప్పుడు ఫీల్డ్ మార్షల్) ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం మే 10న ఉదయం ప్రార్థన తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసిందని చెప్పారు. అయితే తెల్లవారుజామున సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సులపై కురిసాయన్నారు. ఈ దాడి గురించి మునీర్ తనకు సమాచారం ఇచ్చారన్నారు.

 "మే 9-10 రాత్రి మేము భారతీయ దురాక్రమణకు జవాబుగా ప్రతిస్పందించాలని నిర్ణయించుకున్నాము. మా సైన్యం ఉదయం 4.30 గంటలకు భారతదేశానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. కానీ దానికి ముందే భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించి భారీ దాడి చేసింది. వారు పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నారు. రావల్పిండి విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది." అని ప్రధాని హెహబాజ్ అన్నారు.

 మే 9-10 రాత్రి రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం సహా 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. పశ్చిమ సరిహద్దులో పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ చేసిన డ్రోన్ మరియు క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం ఈ చర్య తీసుకుంది.

పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న రావల్పిండి వైమానిక స్థావరంలో లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్, ఇల్యూషిన్ ఐఎల్-78 రిఫ్యూలర్ వంటి విమానాలు ఉన్నాయి. కనీసం రెండు సైనిక రవాణా వాహనాలు దెబ్బతిన్నాయని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

నూర్ ఖాన్ కాకుండా భారతదేశం రఫీకీ, మురీద్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, స్కర్దూ, భోలారి, జాకోబాబాద్, సర్గోధాలపై దాడి చేసింది. వైమానిక స్థావరాలపై ఖచ్చితమైన దాడుల కోసం భారతదేశం Su-30MKI జెట్ నుండి దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది.