ఇండియాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాకిస్థాన్ మాజీ ఎంపీ .. ఎందుకో తెలుసా?
పాకిస్థాన్ కు చెందిన ఓ మాజీ ఎంపీ గత 25 ఏళ్లుగా భారతదేశంలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్నాడు. అతడు రాజకీయాలను వదిలేసి, ఆస్తిపాస్తులను కాదని ఇలా ఇండియాలో ఎందుకుంటున్నాడు? ఐస్ క్రీంలు ఎందుకు అమ్ముతున్నాడు? ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
25 ఏళ్లుగా ఇండియాలోనే పాక్ మాజీ ఎంపీ
India Pakistan : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత అయితే వివాదం మరింత ఎక్కువై ఇరుదేశాలు యుద్దానికే సిద్దమయ్యాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకున్నారు... ఇందులో భాగంగానే పాకిస్థానీ పౌరులు దేశాన్ని వీడాలని భారత్ ఆదేశించింది. దీంతో చాలామంది పాకిస్థానీలు తమ దేశానికి వెళ్లిపోయారు... కానీ ఆ దేశానికి చెందిన ఓ మాజీ ఎంపీ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. కుటుంబసమేతంగా ఇక్కడే ఉండిపోయిన సదరు మాజీ పొలిటీషన్ ఐస్ క్రీంలు అమ్ముకుంటున్నారు. అతడు ఇక్కడే ఎందుకున్నాడు? ఐస్ క్రీంలు అమ్మడానికి కారణమేంటో తెలుసుకుందాం.
భారతదేశానికి పాక్ మాజీ ఎంపీ ఎందుకు వలసవచ్చాడు?
పాకిస్థాన్ కు చెందిన డబాయా రాం పాకిస్థాన్ కు చెెందిన మాజీ ఎంపీ. బెనజీర్ భుట్టో హయాంలో అంటే 1989లో ఎంపీగా గెలిచారు. అయితే ప్రజా ప్రతినిధి అయినప్పటికీ మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతో ఆయనకు పాక్ లో రక్షణ లేకుండా పోయింది. డబాయా రాం ఎంపీగా ఉండగానే ఆయన కూతుర్ని దుండగులు కిడ్నాప్ చేసారు... అయినా ఆయన ఏం చేయలేకపోయాడు. ఇలా రాజకీయంగా మంచి పలుకుబడి, మంచి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ అతడు సొంత కుంటుంబానికే రక్షణ కల్పించలేకపోయాడు... దీంతో 2000 సంవత్సరంలో పాక్ ను వీడి ఇండియాకు వలసవచ్చాడు.
భార్య రాజో రాణితో పాటు 8 మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లతో టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు డబాయా రాం. మొదట్లో హర్యానాలోని రోహ్ తక్ లో నివాసమున్న ఈ కుటుంబం 2008 లో ఫతేబాద్ లోని రతన్ గఢ్ కు మకాం మార్చింది. గత 25 ఏళ్లుగా పాకిస్థాన్ మాజీ ఎంపీ కుటుంబం ఇండియాలోనే ఉంటోంది... ప్రస్తుతం అతడి కుటుంబంలో 30 మంది సభ్యులు ఉన్నారు.
బండిపై ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ మాజీ ఎంపీ
ఐస్ క్రీంల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పాక్ మాజీ ఎంపీ డబాయా రాం. తనకు పాకిస్థాన్ లో మంచి ఇళ్ళు, 25 ఎకరాల పొలం ఉన్నా తిరిగి అక్కడికి వెళ్లబోనని.. తన కుటుంబం సురక్షితంగా ఉంది కాబట్టి ఇక్కడే ఉంటానంటున్నారు. అయితే తన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు మహిళలతో సహా ఆరుగురికి భారత పౌరసత్వం లభించిందని.. మిగతావారిని కూడా ఇండియన్స్ గానే గుర్తించి పౌరసత్వం ఇవ్వాలని డబాయా రాం కోరుతున్నాడు. ఇప్పటికే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రాసెస్ లో ఉన్నట్లు చెబుతున్నాడు.
భారతీయులు మంచి మనసు గలవారని... పాకిస్థాన్ నుండి వచ్చినా తమకు ఆశ్రయం కల్పించి మద్దతుగా నిలిచారని డబాయా రాం తెలిపాడు. పాలకులు కూడా తమకు అండగా నిలిచారని.. అందువల్లే తన కుటుంబం ప్రశాంతంగా జీవించగలుగుతోందన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, పాకిస్థాన్ లో ఆస్తిపాస్తులు ఉన్నప్పటికి... ఇక్కడ కుటుంబపోషణ కోసం బండిపై కుల్ఫీ ఐస్ క్రీంలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు డబాయా రాం తెలిపారు.
ఇండియా పౌరసత్వం కోసం పాకిస్థానీ ఫ్యామిలీ ఎదురుచూపులు
భారత్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు, ఇతర ఆధారపత్రాలను పొందారని డబాయా రాం తెలిపారు అందరం త్వరలో భారత పౌరసత్వం లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నామని... ఇందుకోసం రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. సిఎఎ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుందని నమ్మకంతో ఉన్నట్లు డబాయా రాం తెలిపారు.
ఉగ్రవాదంపై పోరులో భారత్ కే పాక్ మాజీ ఎంపీ మద్దతు
ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై డబాయా రాం స్పందించారు. ఉగ్రవాదుల ఏరివేతకోసం భారత ఆర్మీ జరిపిన ఆపరేషన్ సిందూర్ ను అతడు ప్రశంసించాడు. ఇండియాలో హింసాత్మక ఘటనలకు పాల్పడే ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే తుదముట్టించడం సరైందేనని డబాయా రాం అన్నారు.