కొండా సురేఖ అంటే ఫైర్ బ్రాండ్ అని తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్య‌లు బుమ‌రాంగ్ అవుతున్నాయి, ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారుతున్నాయి. మొన్న‌టికి మొన్న హీరో నాగార్జున కుటుంబ స‌భ్యుల‌పై అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన కొండ సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి ర‌చ్చకు దారి తీశాయి.   

వివ‌రాల్లో వెళితే.. తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. ఫైల్ క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బు తీసుకుంటారని చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచాయి. శుక్ర‌వారం వ‌రంగ‌ల్‌లోని ఓ ఓ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "నేను అటవీ శాఖామంత్రిని కాబట్టి కొన్ని కంపెనీలు నా దగ్గరకు ఫైల్ క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు అలాంటి పనులకు డబ్బు తీసుకుంటారు. కానీ నేను ఏ రూపాయిలు అవసరం లేదని, బదులుగా సామాజిక సేవ చేయాలని చెప్పాను. ఉదాహరణకు స్కూల్ క‌ట్ట‌మ‌ని  సూచించాను" అని ఆమె వ్యాఖ్యానించారు.

అదే సందర్భంలో ఒక కంపెనీని కాలేజ్ భవనం నిర్మించమని సూచించగా, వారు దానిని అంగీకరించి రూ. 4.5 కోట్లు వ్యయంతో భవనం నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ప్ర‌తిప‌క్షాలు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఏ స్థాయిలో అవినీతి జ‌రుగుతుందో చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

కొండా సురేఖ చేసి వ్యాఖ్యలు

 

Scroll to load tweet…

అయితే త‌న వ్యాఖ్య‌ల‌తో దుమారం రేగిన విష‌యాన్ని గుర్తించిన వెంట‌నే కొండ సురేఖ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ విష‌య‌మై ఆమె ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు.. త‌న‌ వ్యాఖ్యల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రుల పని తీరును ఉద్దేశించి మాట్లాడాను. వారు డబ్బు తీసుకునేవారు అని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. "నా మాటలను వక్రీకరించడం సరైంది కాదు. ఈ అంశంపై పూర్తి వివరాలు వీడియో ద్వారా త్వరలోనే చెబుతాను" అని ఆమె పేర్కొన్నారు.

తన మాటలను వక్రీకరించంటూ కొండా సురేఖ చేసిన ట్వీట్

 

Scroll to load tweet…

ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా కుందా సురేఖ అప్పటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై చేసిన ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె అప్పట్లో నాగచైతన్య–సమంత విడాకులకు కేటీఆర్ కారణమని వ్యాఖ్యానించారు. దీని వల్ల నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ ఆమెపై కేసు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.