నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా తొమ్మిది మంది చనిపోయారు. 105 మంది భారతీయులతో సహా 384 మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Nepal Floods : పొరుగుదేశం నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు… ఈ ప్రకృతి విపత్తులో తొమ్మిది మంది మరణించారు. 105 మంది భారతీయులతో సహా మొత్తం 384 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 32 మంది పోలీసులు, 25 మంది యాత్రికులు కూడా ఉన్నారు.

ఇండియా నుండి నేపాల్ ను సందర్శించేందకు వెళ్లిన చాలామంది వరదల్లో చిక్కుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న టూరిస్టులతో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. ఇండియన్ టూరిస్ట్ కు సహాయం అందించేందుకు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను (+977 985 131 6807, +977 970 910 7500) ఏర్పాటు చేసింది.

చైనా సరిహద్దు ప్రాంతాల్లో వరదలు సంభవించడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎన్నో గ్రామాలు, మార్కెట్లు, నీటిపారుదల ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

బీహార్, యూపీలో హై అలర్ట్

నేపాల్‌లోని వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు.

కష్టకాలంలో ఉన్న నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సామగ్రిని వెంటనే అందిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బలేంద్ర షా తో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు.

Scroll to load tweet…

గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి…

నేపాల్‌లో చాలా గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ నుంచి వచ్చే భోటే కోశీ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి, వరద పోటెత్తింది. దీంతో నదీ తీరంలోని గ్రామాలన్నీ నీట మునిగాయి. ఇళ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.

ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి, పరిస్థితిని అంచనా వేయడానికి నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.