Antony Blinken: భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఆరోపించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు హాజరైన మీడియా సమావేశంలో అమెరికా అధికారి ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
human rights abuse: భారత్ లో గత కొంత కాలంగా కొన్ని సమాజిక వర్గాలపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లిం వ్యతిరేకంగా వస్తున్న వ్యాఖ్యలు, విధానాలపై పలు దేశాల ప్రతినిధులు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఆరోపించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు హాజరైన మీడియా సమావేశంలో అమెరికా అధికారి ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముస్లిం వ్యతిరేక విధానాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం విముఖత చూపడాన్ని అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ ప్రశ్నించిన కొద్ది రోజులకే.. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెరుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు.
సోమవారం నాడు రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మరియు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో సంయుక్త విలేకరుల సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, “కొన్ని మానవ హక్కుల ఉల్లంఘనలతో సహా భారతదేశంలో ఇటీవలి కొన్ని పరిణామాలను మేము పర్యవేక్షిస్తున్నాము. ప్రభుత్వం, పోలీసులు, జైలు అధికారులు తీరును గమనిస్తున్నాం" అని అన్నారు. అయినప్పటికీ, మానవ హక్కులను పరిరక్షించడం వంటి ప్రజాస్వామ్య విలువలకు భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ నిబద్ధతను కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. బ్లింకెన్ దీనిపై ఎక్కువ మాట్లాడనప్పటికీ, రాజ్నాథ్ సింగ్, జైశంకర్ లు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ మాట్లాడుతూ.. భారత్ లో ముస్లింలకు వ్యతిరేకంగా జరుతున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ లో చోటుచేసుకున్న పలు విషయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వాటిలో కొన్ని ప్రధాన అంశాలు...
1. 2019లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడానికి పౌరసత్వ సవరణ చట్టం 2019 చట్టాన్ని తీసుకువచ్చింది. చట్టం ప్రకారం డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు సిక్కులు పౌరసత్వం పొందడానికి అర్హులు.
2. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అమలుకు ఇది తొలి అడుగు అని పలువురు నిపుణులు ఆరోపించారు. అయితే, CAA మరియు NRC మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ, దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి.
3. కర్నాటకలో హిజాబ్ నిషేధంపై ఇటీవలి వివాదం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఉడిపిలో రాజుకున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తలకు దారితీసింది. ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది.
4. ఆ తర్వాత హలాల్ మాంసాన్ని నిషేధించాలనే డిమాండ్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. కొన్ని గ్రూపులు హలాల్ మాంసాన్ని 'ఆర్థిక జిహాద్'గా చేర్చి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
