Khamenei Death: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు గురయ్యారని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఆయన 'అమరత్వం' పొందారని ప్రకటిస్తూ ఓ యాంకర్ టీవీలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

టీవీలో భావోద్వేగ ప్రకటన

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారన్న వార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆ దేశ అధికారిక మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' యాంకర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లైవ్ టీవీలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వార్తను ప్రకటించేటప్పుడు భావోద్వేగంతో మాట్లాడారు. ఖమేనీని "ఇస్లామిక్ విప్లవ నాయకుడు" అని సంబోధిస్తూ, ఆయన హత్యకు గురయ్యారని తెలిపారు.

ఖమేనీ మరణవార్త నిజమేనని యాంకర్ ధృవీకరించారు. ఈ ప్రకటన తర్వాత కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ పుణ్యక్షేత్రంలో భక్తులు విషాదంలో మునిగిపోయిన దృశ్యాలను కూడా ప్రెస్ టీవీ ప్రసారం చేసింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్‌లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి, ఖమేనీ చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేస్తూ తమ సంతాపం తెలిపారు.

40 రోజుల సంతాపం, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక

ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. "ఇస్లామిక్ విప్లవ నాయకుడి హత్య అనే నేరాన్ని క్షమించబోం. అమరవీరుడైన మా నాయకుడి పవిత్ర రక్తం.. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి నేరపూరిత దేశాలను కూకటివేళ్లతో పెకిలిస్తుంది" అని ప్రభుత్వం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

అయతొల్లా అలీ ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్‌లో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. షియా ఇస్లాంలో, మరణించిన 40వ రోజుకు (అర్బయీన్) ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ/లయన్స్ రోర్) ఖమేనీ మరణించారు. సరిగ్గా 40 రోజుల సంతాప దినాలు ప్రకటించడం ద్వారా, కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అక్కడి మత పెద్దలకు తగినంత సమయం దొరుకుతుంది.

తర్వాతి నాయకుడు ఎవరు? కొనసాగుతున్న ఉత్కంఠ

దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినాలు ప్రకటించిన సుప్రీం లీడర్ కార్యాలయం, జెండాలను అవనతం చేయాలని ఆదేశించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో 37 ఏళ్ల సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. విప్లవ స్థాపకుడు రుహొల్లా ఖొమైనీ తర్వాత 1989 నుంచి ఖమేనీ ఈ పదవిలో ఉన్నారు. 

Scroll to load tweet…

టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఖమేనీ వారసుడి ఎంపికపైనే ఉంది. తర్వాతి నాయకుడు ఎవరు, ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యుద్ధ వాతావరణంలో సమావేశం కావడం కష్టం కాబట్టి, రిపబ్లిక్ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుంది - మత పెద్దల చేతుల్లోనా లేక రివల్యూషనరీ గార్డ్ చేతుల్లోనా అనేది అసలు సిసలు సస్పెన్స్.

Scroll to load tweet…

'సంరక్షకుడి అమరత్వం'

ఖమేనీ మరణాన్ని ఓటమిగా కాకుండా, దేశ సార్వభౌమత్వం కోసం చేసిన చివరి త్యాగంగా, 'సంరక్షకుడి అమరత్వం'గా అక్కడి అధికారిక మీడియా అభివర్ణిస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక ఫార్సీ X (ట్విట్టర్) ఖాతాలో ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఖురాన్‌లోని ఒక వాక్యాన్ని పోస్ట్ చేశారు. తస్నీమ్ న్యూస్ ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున తన కార్యాలయంలో ఉన్నప్పుడు ఖమేనీ హత్యకు గురయ్యారు. ఆయన అధికారిక ఫార్సీ పేజీలో సూరా అల్-అహ్జాబ్, 33:23లోని వాక్యాన్ని పోస్ట్ చేశారు. దాని అర్థం: “విశ్వాసులలో కొందరు అల్లాకు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నారు. వారిలో కొందరు తమ ప్రమాణాన్ని (మరణం ద్వారా) నెరవేర్చారు, మరికొందరు ఇంకా వేచి ఉన్నారు. వారు తమ నిబద్ధతను ఏమాత్రం మార్చుకోలేదు.”.