సారాంశం
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. ఇన్నాళ్లు అత్యధిక జనాభా గల దేశాల జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చైనాను భారత్ బీట్ చేసింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. ఇన్నాళ్లు అత్యధిక జనాభా గల దేశాల జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చైనాను భారత్ బీట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్లు ఐకరాజ్య సమితి డేటా వెల్లడించింది. భారత్ జనాభా 142.86 కోట్లు ఉన్నట్టుగా ఐకరాజ్య సమితి తెలిపింది. ఇక, చైనా జనాభా 142.57 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. యూఎన్ఎఫ్పీఏ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 ప్రకారం.. భారతదేశ జనాభా 1,428.6 మిలియన్లకు చేరుకోగా.. చైనా జనాభా 2.9 మిలియన్ల తేడాతో 1,425.7 మిలియన్లుగా ఉందని తెలిపింది.
అత్యంత జనాభా కలిగిన దేశాల జాబితాలో భారత్, చైనాలు నిలువగా.. అమెరికా మూడో స్థానంలో ఉంది. అమెరికా జనాభా 340 మిలియన్లుగా ఉందని యూఎన్ఎఫ్పీఏ డేటా వెల్లడించారు. ఇక, భారతదేశ జనాభాలో 25 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్కులే. 10 నుంచి 19 సంవత్సరాల వయస్సులో 18 శాతం, 10 నుంచి 24 సంవత్సరాల వయస్సులో 26 శాతం, 15 నుంచి 64 సంవత్సరాల వయస్సులో 68 శాత, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు 7 శాతం ఉన్నారు.
ఇక, భారతదేశ జనాభా రానున్న మూడు దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుందని.. జనాభా 165 కోట్లకు చేరుకుంటుందని వివిధ ఏజెన్సీల అంచనాలు సూచించాయి. భారతదేశ జనాభా గణాంకాలు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మారుతూ ఉన్నాయి. కేరళ, పంజాబ్లలో వృద్ధాప్య జనాభా ఉండగా.. బీహార్, ఉత్తరప్రదేశ్లలో యువ జనాభా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) భారతదేశ ప్రతినిధి, భూటాన్ కంట్రీ డైరెక్టర్ ఆండ్రియా వోజ్నార్ మాట్లాడుతూ.. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలను 1.4 బిలియన్ అవకాశాలుగా చూడాలని అన్నారు. ‘‘అతిపెద్ద యువతతో కూడిన దేశం.. దాని 254 మిలియన్ల యువత (15-24 సంవత్సరాలు).. ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు, శాశ్వత పరిష్కారాలకు మూలం కావచ్చు’’ అని చెప్పారు.